తెలంగాణలో కోతిని ఉరి తీసిన నీచులు: చెట్టుకు వేలాడుతూ...అల్లాడుతూ: శ్వాస విడిచిన మూగప్రాణి
ఖమ్మం: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనిపించట్లేదనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందీ ఉదంతం. శాడిజానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చింది. చెట్టుకు వేలాడుతూ.. అల్లాడుతూ.. ఊపిరి అందకుండా విలవిల్లాడుతోంటే చూస్తూ రాక్షసానందాన్ని పొందారు కొందరు నీచులు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని వేంసూర్ మండలం అమ్మపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
పుట్ట బద్దలు: అత్యంత ప్రమాదకర తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ టాప్: ఏపీ వాటా ఎక్కువే: ఆందోళనగా
దాహం తీర్చుకోవడానికి
అమ్మపాలెంలో నివసించే వెంకటేశ్వర రావు అనే వ్యక్తికి పొలం ఉంది. ఆదివారం కోతుల గుంపు ఒకటి పొలంలో కనిపించింది. దీనితో వాటిని తరిమేసే ప్రయత్నం చేశాడతను. దీనితో ఓ కోతి నీటి తొట్టెలో పడింది. ఇదే అదునుగా వెంకటేశ్వర రావు దాన్ని బంధించాడు. తీవ్రంగా కొట్టాడు. తన స్నేహితులు జోసెఫ్ రాజశేఖర్, గౌడెల్లి గణపతితో కలిసి కోతి మెడకు తాడును కట్టాడు. దాన్ని ఈడ్చుకుంటూ తన పొలానికి పక్కనే ఉన్న ట్రీ ప్లాంటేషన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరి తీశాడు.
చనిపోయేంత వరకూ అక్కడే..
ఆ కోతి చనిపోయేంత వరకూ అక్కడే ఉన్నాడు. ఊపిరి అందక కోతి విలవిల్లాడుతోంటే చూస్తూ రాక్షసానందాన్ని పొందారు వారంతా. వారిలో ఒకరు కోతి విలవిల్లాడుతోన్న దృశ్యాలను సెల్ఫోన్లో బంధించాడు. కొన్ని నిమిషాల తరువాత కోతి మరణించింది. అది చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం.. కళేబరాన్ని కిందికి దించారు. దహనం చేయడానికి ప్రయత్నించారు. చెత్తను కుప్పగా పోసి, అందులో కోతి కళేబరాన్ని ఉంచి నిప్పు అంటించారు. మంటలు పూర్తిగా అంటుకోలేదు. కోతి కళేబరం పాక్షికంగా కాలిపోయింది.
అటవీ శాఖ అధికారులకు
ఈ సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది. వెంటనే వారు పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. వారిపై వన్యప్రాణుల సంరక్షణా చట్టం-1972లోని సెక్షన్ 9 కింద కేసు నమోదు చేశారు. తమ విచారణ సందర్భంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సత్తుపల్లి అటవీ రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్ నిబంధనల ప్రకారం.. వారిని అరెస్టు చేయలేదని, హౌస్ కస్టడీలో ఉంచామని అన్నారు.
కోతి కళేబరంపై కాలిన గాయాలు..
కోతి కళేబరంపై కాలిన గాయాలు ఉన్నాయని, దాని గురించి నిందితులను ప్రశ్నించగా..దాన్ని తగులబెట్టడానికి ప్రయత్నించినట్లు అంగీకరించారని అన్నారు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికే తాము ఈ పని చేశామని నిందితులు చెబుతున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక కోతిని ఇలా చంపితే.. మిగిలినవి ఇక ఎప్పుడూ ఆ ప్రదేశానికి రావని తాను భావించానని, అందువల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అటవీ రేంజ్ అధికారి చెప్పారు.