ఓటుకు నోటు 'సప్లిమెంటరీ'తో తేలనుంది!: బాబును చేర్చాలంటే..?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసును తెలంగాణ ఎసిబి ఇటీవల వేగవంతం చేసింది. త్వరలో సప్లిమెంటరీ ఛార్జీషీటును దాఖలు చేయనుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను నిందితులుగా ఛార్జీషీట్ దాఖలు చేసింది.
మరికొన్ని పేర్లతో కొద్ది రోజుల్లో సప్లిమెంటరీ చార్జీషీటును దాఖలు చేయనుంది. సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేసినప్పుడు అందులో చంద్రబాబు పేరు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తొలి ఛార్జీషీటులో ఎసిబి 22సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది. వివిధ సందర్భాలలో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పటికి.. నిందితులుగా కాదు. దీంతో, సప్లిమెంటరీ ఛార్జీషీటు పైన అందరి దృష్టి పడింది.
సప్లిమెంటరీ ఛార్జీషీటు దాఖలు చేస్తే చంద్రబాబు పేరును ఎలా ప్రస్తావిస్తారనే ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.