ఇవాంకా, మోడీల కోసం ఆ రోడ్లు మొత్తం ఖాళీ, 45 ని.ల్లో వెళ్లేలా ప్లాన్: పోలీసులకు సవాల్
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా శ్వేతసౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో హైదరాబాదులో పదివేల మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇవాంకా బస చేసిన హోటల్ ట్రైడెంట్, సదస్సు జరిగే హెచ్ఐసి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా శ్వేతసౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో హైదరాబాదులో పదివేల మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇవాంకా బస చేసిన హోటల్ ట్రైడెంట్, సదస్సు జరిగే హెచ్ఐసిసి, విందు జరిగే ఫలక్నుమా ప్యాలెస్ ప్రాంతాల్లోనే.. ఒక్కోచోట పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా:29న మధ్యాహ్నం ఎక్కిడికి వెళ్తారు?
Recommended Video
నగరంలో గత కొద్ది రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇవాంకా ట్రంప్ బస చేసే హోటల్, సదస్సు జరిగే ప్రాంతాలలో పోలీసులు ప్రతి ఇంటికి తిరిగి అందరి వివరాలు సేకరించారు. కొత్తగా ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. పలు సంస్థలు కార్యాలయాలు కూడా మూసుకోనున్నాయి.
భద్రత పెద్ద సవాల్
170 దేశాల నుంచి 1500 మందికి పైగా ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వస్తున్నారు. వీరితో పాటు మోడీ, ఇవాంకా, సీఎం కేసీఆర్, వీఐపీలు కూడా వస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులకు భద్రత సవాల్గా మారింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎస్పీజీ, అమెరికా భద్రతా సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే విందు మరో సవాల్
అతిథులకు మంగళారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లో ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. ఇందుకోసం సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరిని ఫలక్నుమా ప్యాలెస్కు ఎలా తరలించాలన్నది పోలీసులకు మరో సవాల్గా మారింది.
వీరు వెళ్లిన తర్వాత
ఐదు గంటలకు తొలి రోజు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సదస్సు ముగియగానే అతిథులను ఫలక్నుమా ప్యాలెస్కు తరలించేందుకు 45 బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలుత ప్రధాని మోడీ కాన్వాయ్, ఆ తర్వాత ఇవాంకా కాన్వాయ్, అనంతరం కేసీఆర్, కేంద్రమంత్రుల కాన్వాయ్ల వెళ్తాయి. ఆ తర్వాత ఇతర అతిథులను తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
ఆ రహదారిని పూర్తిగా ఖాళీ చేయించాలని నిర్ణయం
ఇందుకోసం మాదాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, రాజేంద్రనగర్, ఫలక్నుమాకు వెళ్లే రహదారిని పూర్తి ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ప్రయాణానికి 40 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశాలు ఉండటంతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేలా లేవు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది
హెచ్ఐసీసీ, ఫలక్నుమా ప్యాలెస్ ప్రాంతాల్లో ఆరువేల మంది పోలీసులను మోహరించారు. నగర పోలీసులు, ఎస్పీజీ, అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు సంయుక్తంగా రక్షణ వ్యూహాలను అమలు చేస్తున్నారు. హెచ్ఐసిసి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు మోడీ, ఇవాంక సహా విదేశీ అతిథులందరినీ చేర్చడం కోసం అవసరమైన కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో ఆ సమయంలో రెండువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. అందరూ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
పోలీసుల ట్రయల్
జీఈఎస్ సదస్సు నుంచి ఫలక్నుమా సదస్సుకు చేరుకునేందుకు గంటంపావు పడుతుందని పోలీసులు అంచనా వేశారు. మోడీ, ఇవాంకాలు రోడ్డుపై అంతసేపు ప్రయాణించడం సరికాదని అమెరికా సీక్రెట్ సర్వీస్, కేంద్ర నిఘా వర్గాలు చెప్పడంతో.. సోమవారం సాయంత్రం రోడ్డుకు రెండువైపులా వాహనాల రాకపోకలను నిలిపేసి ప్రయోగం చేశారు. పోలీసులు అధికారులు వాహనాల్లో 53 నిమిషాల్లో చేరుకున్నారు. దీనిని మరింత తగ్గించాలని, 45 నిమిషాల్లో చేర్చాలని నిర్ణయించుకున్నారు.
దుకాణాలు బంద్
ఫలక్నుమా పరిసరాల్లో విందు సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పాతబస్తీలో పరిస్థితులు, పద్మావతి చిత్రంపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యాఖ్యల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోను దుకాణాలను మూసివేయాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ - బెంగళూరు దారిలో వెళ్లే వారు మరో దారి చూసుకోవాలని చెప్పారు.