బస్సు డ్రైవర్ల కక్కుర్తి, అడవిలో 12గంటలు: బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణికుల బెంబేలు
హోస్పేట/హైదరాబాద్: ఆ బస్సుల డ్రైవర్ల కక్కుర్తి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు టోల్ట్యాక్స్ తప్పించుకునేందుకు శుక్రవారం రాత్రి ఓ అడవిలో ఆపేశారు. దీంతో ప్రయాణికుల ఆగ్రహానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బయల్దేరిన బస్సుల డ్రైవర్లు అంతర్రాష్ట్ర రవాణా పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు వేరే మార్గంలోకి మళ్లించినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాద్ చేరాల్సిన ఆ బస్సులు దారి మళ్లించి వేరేదారిలో తీసుకెళ్లారు.
ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ప్రయణికులు వేరే మార్గంలో వెళ్తున్నట్టు గ్రహించి బస్సు డ్రైవర్లను నిలదీశారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన బస్సు ఇంకా కర్ణాటక సరిహద్దు కూడా దాటకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 12గంటలపాటు ఆ బస్సులు అడవీలోనే తిరగడం గమనార్హం.
కాగా, టోల్ ట్యాక్స్ తప్పించుకునేందుకే బస్సును దారిమళ్లించినట్టు డ్రైవర్ తెలిపాడు. ఈ క్రమంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బూదగుంపలో కొద్దిసేపు గందరగోళం తర్వాత శనివారం ఉదయం 10:00 గంటల సమయంలో బస్సు హైదరాబాద్కు బయల్దేరినట్టు తెలుస్తోంది.
టోల్ టాక్స్ ఎగవేసేందుకు తమ ప్రాణాలను పణంగా పెడతావా? అంటూ ప్రయాణికులు డ్రైవర్పై మండిపడ్డారు. కాగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేదని, రాయచూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నామని డ్రైవర్లు చెప్పడం గమనార్హం. శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో బస్సులు ఉంటాయని చెప్పారు.