సూర్యాపేట్కు కల్నల్ సంతోష్బాబు పార్థివదేహం: కాస్సేపట్లో అంతిమయాత్ర: కోవిడ్ నిబంధనలతో
సూర్యాపేట్: లఢక్ సమీపంలో భారత్-చైనా సరిహద్దుల్లో రెండు దేశాల చోటు చేసుకున్న ఘర్షణల్లో వీరమరణం పొందిన 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్బాబ పార్థివ దేహం ఆయన స్వస్థలమైన తెలంగాణలోని సూర్యాపేట్కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి రాత్రి 11: 30 గంటల సమయంలో ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో నివాసానికి తీసుకొచ్చారు. వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబు పార్థివదేహన్ని చూడగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో విషాదం కట్టలు తెంచుకుంది. పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.
చైనాపై తాడో పేడో: ఎల్లుండి అఖిలపక్ష భేటీ: కమ్యూనిస్టులపై ఫోకస్: యుద్ధం చివరి అస్త్రంగా
హకీంపేట్ నుంచి సూర్యాపేట్కు
కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని ప్రత్యేక సైనిక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, పలువురు ఆర్మీ అధికారులు నివాళి అర్పించారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ప్రత్యేక అంబులెన్స్లో పార్థివదేహాన్ని సూర్యాపేట్లోని ఆయన నివాసానికి తీసుకెెళ్లారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని నివాసంలో ఉంచుతారు. సంతోష్ బాబును కడసారిగా చూడటానికి వందలాది మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
కాస్సేపట్లో అంతిమయాత్ర..
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సంతోష్బాబు నివాసం వద్ద ఆయన పార్థివదేహానికి సైనికులు గౌరవవందనాన్ని అర్పిస్తారు. దీనికోసం 50 మంది ఆర్మీ అధికారులు, జవాన్లు ఇప్పటిక సూర్యాపేట్కు చేరుకున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్బాబు స్వస్థలం కేసారంలో ఆయన కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. అంత్యక్రియల ఏర్పాట్లను కూడా జిల్లా అధికారులు పూర్తి చేశారు.
కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో..
సంతోష్బాబు నివాసం నుంచి కేసారం గ్రామ వరకు సైనిక వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతిమక్రియలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. సంతోష్ బాబు పార్థివదేహానికి కడసారిగా చూడటానికి వచ్చే వారు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం సూచనలను జారీ చేసింది.
Recommended Video
మంత్రి జగదీశ్ రెడ్డి..
ప్రభుత్వం తరఫున జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఆర్మీ ఏఓసీ అధికారి మేజర్ ఫరీది, దినేష్కుమార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, సూర్యాపేట్ ఆర్డీఓ మోహన్రావు, డీఎస్పీ మోహన్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు అంతిమయాత్రలో పాల్గొంటారు. సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉన్నందున 50 కంటే ఎక్కువమందిని అంత్యక్రియలకు అనుమతించట్లేదని ఆర్డీఓ మోహన్ రావు స్పష్టం చేశారు.