తెలంగాణకు తర్వాతి సీఎం నేనే.. కేసీఆర్ ఖేల్ ఖతం.. కేటీఆర్కు సవాల్.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్థులపై విమర్శలదాడిని ముమ్మరం చేశాయి. మరీ ముఖ్యంగా బీజేపీ.. లోక్సభ ఎన్నికల ఊపుతో మున్సిపోల్స్ లోనూ ఉధృతంగా దూసుకుపోతున్నది. కేంద్ర మంత్రులు సైతం పురప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని ఎద్దేవాచేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే క్రమంలో సీఎం పోస్టుపై ఆయన చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
వైట్ పేపర్ ఇస్తారా?
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొంచెం కూడా సహాయం చేయలేదని, అలాటప్పుడు బీజేపీ నేతలు ఏ ముఖంపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుతారంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా సాయపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పిన విషయాన్ని కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారని, తప్పుడు విమర్శలు మానుకుని, యూపీఏ హయాంలో ఎన్డీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులపై వైట్ పేపర్(శ్వేతపత్రం) విడుదల చేయాలని కేటీఆర్ కు సవాలు విసిరారు.
నేనే సీఎం కావొచ్చు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తెలంగాణకు తర్వాతి సీఎం తానే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ‘‘టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం. సీఎ కేసీఆర్ పని అయిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు హైకమాండ్ నన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించొచ్చు. లేదా సాధారణ కార్యకర్త సీఎం చేయొచ్చు. ఏదిఏమైనా బీజేపీ గెలవడం మాత్రం ఖాయం''అని అన్నారు.
మజ్లిస్ చేతిలో బందీలు..
మతోన్మాద మజ్లిస్ పార్టీ చేతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బందీ అయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ విమర్శించనట్లు బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోవాల్సిన అగత్యం పట్టలేదని, టీఆర్ఎస్ పార్టీనే సిగ్గులేకుండా ఎంఐఎంతో అంటకాగుతోందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తండ్రీకొడుకులకు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ రెండో రాజధాని..
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించబోతున్నారన్నది కేవలం ప్రచారమేనని, అలాంటి అంశమేదీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రపంచం విస్తుపోయే స్థాయిలో రామ మందిరాన్ని నిర్మిస్తామని, అతిత్వరలోనే దానికి సంబంధించిన పనులు మొదలవుతాయని చెప్పారు.