తల్లి మరణం ఓవైపు.. ఇంటర్ పరీక్ష మరోవైపు.. ఓ విద్యార్థి ఆవేదన!
తల్లి చనిపోయిందన్న విషయాన్ని జీర్ణం చేసుకోలేక.. పొంగుకొస్తున్న దు:ఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. పరీక్ష అనంతరం స్వగ్రామానికి వెళ్లి తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు.
చిన్నకోడూరు: ఓవైపు తల్లి మరణం.. మరోవైపు ఇంటర్ పరీక్ష.. రెండింటి నడుమ ఆ విద్యార్థి ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యాడు. చివరికి పరీక్ష రాసిన తర్వాతే పుట్టెడు దు:ఖంతో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గంగారం గ్రామానికి చెందిన రైతు మూర్తి లక్ష్మారెడ్డి, వాణిల చిన్న కుమారుడు నితీష్రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్నాడు. సరూర్ నగర్ లోని చెరుకుతోట కాలనీలో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో ఇంటర్ మొదటి సంవత్సరం(ఎంపీసీ) విద్యను అభ్యసిస్తున్నాడు
ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నితీష్ రెడ్డి తల్లి గురువారం ఉదయం కన్నుమూసింది. విషయం తెలుసుకున్న నితీష్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అక్క ఆగ్రా నుంచి రావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. అంత్యక్రియలు శుక్రవారానికి వాయిదా వేశారు.
దీంతో నగరానికి వెళ్లి పరీక్ష రాసి రావాలని పలువురు సూచించడంతో నితీష్ రెడ్డి సరూర్ నగర్ కు చేరుకుని ఆంగ్లం పరీక్ష రాశాడు. తల్లి చనిపోయిందన్న విషయాన్ని జీర్ణం చేసుకోలేక.. పొంగుకొస్తున్న దు:ఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. పరీక్ష అనంతరం స్వగ్రామానికి వెళ్లి తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు.