ఓ తల్లి దైన్యం : మొగుడు లేడు.. పెంచే స్థోమత లేదు..! అమ్మకానికి కన్న పేగు!
మెట్పల్లి : ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడేది అమ్మ. ప్రపంచాన్ని ఎదురించి కన్నపేగు కోసం పోరాటం చేస్తుంది. అలాంటి ఓ మాతృమూర్తి కష్టాల కడలిని ఈదలేక, కన్నబిడ్డల ఆకలి తీర్చలేక కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లి ప్రేమను చంపుకుని ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టింది. కన్నీరు పెట్టించే ఈ ఘటన మెట్పల్లి జిల్లాలో జరిగింది.
నయవంచన : భూతవైద్యం చేయిస్తానని యువతిపై అత్యాచారం..
అమ్మకానికి ఆడపిల్ల
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కళానగర్ కాలనీ. ఆదివారం మధ్యాహ్నం సమయం. ఓ మహిళ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటింటికీ తిరుగుతోంది. చిన్నారుల్లో ఒకరు ఐదేళ్ల వారు కాగా.. మరొకరు కేవలం నెల రోజుల శిశువు. తొలుత బస్టాండ్, ఆ తర్వాత హాస్పిటళ్ల వద్ద తిరిగిన మహిళ ఆ తర్వాత ఇంటింటికీ తిరుగుతూ బిడ్డను కొనుక్కోమని బేరమాడింది. నెల రోజుల పసిపాపను రూ. 20వేలకు అమ్ముతానని కనిపించిన వారినల్లా వేడుకుంది.
అనుమానంతో పోలీసులకు సమాచారం
బిడ్డను అంగడి సరుకుగా మార్చిన ఆ తల్లిని చూసి కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరు ఆమె దయనీయ స్థితి చూసి జాలిపడ్డారు. రూ.20వేలకు బిడ్డను ఇచ్చేస్తానని చెప్పడంతో ఓ కుటుంబం పాపను తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈ లోపు గ్రామస్తులు అనుమానించి ఆ తల్లిని నిలదీయడంతో వారు వెనక్కితగ్గారు. మహిళ పిల్లల అసలు తల్లిలా లేదని భావించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు మహిళ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వెంబడించి పట్టుకుని స్టేషన్కు తరలించారు.
భర్త వదిలేయడంతో
నిర్మల్ జిల్లా కడెంలోని ఒడ్డెర కాలనీకి చెందిన పుట్ట గంగ జ్యోతి, నవీన్ భార్యభర్తలు. వారికి ఒక సంతానం. మేస్త్రీ పనిచేసే నవీన్ ఐదు నెలల క్రితం భార్యాబిడ్డల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటికే గర్భవతి అయిన జ్యోతి చెత్త పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ వాటర్ బాటిళ్లు సేకరించి అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నెల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చిన జ్యోతికి భర్త లేకపోవడంతో బిడ్డల్ని సాకడం భారంగా మారింది. దీంతో మెట్పల్లికి వచ్చిన ఆమె పసిపాను విక్రయించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. వారు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు తల్లిబిడ్డల్ని సంరక్షణ కేంద్రానికి తరలించారు.