పనికిమాలిన వ్యక్తి మాటలతో, నీ మాటకు విలువుందా: బాబుపై రెచ్చిన మోత్కుపల్లి, రేవంత్ కూతురు పెళ్లిపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో షాక్ మీద షాక్ తగులుతుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆయనపై శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోత్కుపల్లి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. రెండు రోజులుగా ఆయన అధినేతపై విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ మహానాడుకు మోత్కుపల్లి గైర్హాజరు, ప్రభుత్వంపై మండిపడిన ఎల్ రమణ
దీంతో మోత్కుపల్లి టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనను ఒకలా, కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని మరోలా చూశారని అభిప్రాయపడ్డారు. దళితులకు విలువ లేదని, తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ ఎక్కడిదని మండిపడ్డారు.
అపాయింటుమెంట్ ఇవ్వలేదు, తీవ్రంగా పరిగణిస్తున్నా
తాను కలుస్తానంటే చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వలేదని మోత్కుపల్లి చెప్పారు. దీనిని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. మాల, మాదిగలకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చంద్రబాబు, అంబేడ్కర్ విగ్రహం పెడతానంటే ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. తమకు తెలుగుదేశం పార్టీలో గౌరవం లేకుండా పోయిందన్నారు.
కేసీఆర్కు కితాబు, చంద్రబాబు ఎందుకు చేయట్లేదు
అదే సమయంలో మోత్కుపల్లి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు ఎందుకు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ తెలంగాణలో డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు.
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే పరిస్థితి నెలకొన్నదని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ లేదని అభిప్రాయపడ్డారు. ఆరు నెలలకు ఒకసారి ఏపీ నుంచి తెలంగాణకు వస్తే టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
పనికిమాలిన వ్యక్తి మాటలు నమ్మి సర్వనాశనం చేశారు
తాము ఎంతోకాలం నుంచి పార్టీ కోసం సేవ చేస్తున్నామని మోత్కుపల్లి చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం రేవంత్ రెడ్డిని నమ్మారని, ఏమయిందని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పనికిమాలిన వ్యక్తిని నమ్మి పార్టీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
రేవంత్ కూతురు పెళ్లి అలా, నా బిడ్డ పెళ్లికి ఇలా
చంద్రబాబు తనతో మాట్లాడేందుకు కనీసం 5 నిమిషాలు సమయం ఇవ్వకుంటే ఎలాగని మోత్కుపల్లి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అడ్డంగా మాట్లాడినందుకు తనను పట్టించుకోవడం లేదేమో అని వాపోయారు. రేవంత్ కూతురు పెళ్లికి చంద్రబాబు దగ్గర ఉండి అన్నీ చేశారని, కానీ నా బిడ్డ పెళ్లికి ఎప్పుడో నాలుగు గంటలకు వచ్చారన్నారు. నేను చంద్రబాబు కోసం దెబ్బలు తిన్నానని, ఆయనను పూర్తిగా నమ్మానని, కానీ నమ్మితే నాకు చేసిందేమీ లేదని మోత్కుపల్లి అన్నారు.