ఆయనవల్లే 12మంది: మోత్కుపల్లి, ఎందుకొస్తున్నానంటే, నాతో వీళ్లూ: కాంగ్రెస్ నేతలతో రేవంత్
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం రాత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం రాత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
చదవండి: దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాడని అందుకే పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ వల్లనే పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. ఆయన వెళ్లిపోతే తెలంగాణలో టిడిపి మరింత బలపడుతుందన్నారు.
చదవండి: ఒక్క దెబ్బకు రెండు: రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటీ, సమాధానాలు సిద్ధం?
12 మంది ఎమ్మెల్యేలు ఆయన వైఖరి నచ్చకే వెళ్లిపోయారు
15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది రేవంత్ వైఖరి నచ్చకే వెళ్లిపోయారని మోత్కుపల్లి అన్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో తనకు రేవంత్కు వాగ్వాదం జరిగిందన్నారు. రేవంత్ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను, అరవింద్ కుమార్ గౌడ్ సమావేశం బహిష్కరించి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. రేవంత్ కాంగ్రెస్ చేరితే ఆ పార్టీ కూడా భ్రష్టుపట్టిపోతుందన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించాలన్నారు.
కేసీఆర్ తనకు మంచి స్నేహితుడు
తెలంగాణ సీఎం కేసీఆర్తో తనకు ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని, తామిద్దరం మంచి స్నేహితులమని మోత్కుపల్లి ఆసక్తికర వ్యాక్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమయ్యాక కేసీఆర్తో తనకు మాటలు లేవన్నారు. రేవంత్ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభంలేదన్నారు. ఆయనపై చర్యలు అధిష్ఠానం మాత్రమే తీసుకోవాలన్నారు. ఇతర పార్టీలతో పొత్తులపై రేవంత్ ఒక్కరే నిర్ణయం తీసుకోలేరన్నారు.
రేవంత్ రెడ్డితో శత్రుత్వం లేదు
ఆలేరు నియోజకవర్గంలో తాను ఇప్పుడు నామినేషన్ వేసినా గెలుస్తానని మోత్కుపల్లి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్తో తనకెలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కేంద్రంలో బిజపితో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్తో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. తెరాసతో మాత్రం పొత్తుకు అవకాశముందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెరాసతో పొత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తాను టిడిపి హీరోనని, చివరి వరకూ ఆ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు.
ఎందుకు కాంగ్రెస్లోకి వస్తున్నానంటే
మరోవైపు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ఎందుకు ఆ పార్టీలోకి వస్తుందీ కారణాలను వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేవంత్ కాంగ్రెస్లోకి వస్తారనే చర్చ పార్టీలో గత కొంతకాలంగా ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడు వస్తారన్న విషయంలో ఎవరికీ అంచనా లేదు.
ఇప్పటికి ఇప్పుడు చేరకపోవచ్చా
చాలామంది ఇప్పుడే రాకపోవచ్చునని అనుకున్నారు. పైగా ఆయన పార్టీలోకి వచ్చేందుకు చాలా ముందే తమకు సమాచారం ఉంటుందని భావించారు. కానీ, అనూహ్యంగా రేవంత్ రాకపై వార్తలు వెల్లువెత్తడంతో వారు కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. అదే సమయంలో రేవంత్ రాకపై అటు కాంగ్రెస్ అధిష్ఠానం గానీ, ఇటు రాష్ట్ర అధ్యక్షులు గానీ ధ్రువీకరించట్లేదు.
నాతో ఎవరెవరు వస్తున్నారంటే
రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్నీ స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఇటు టిడిపికి, అటు కాంగ్రెస్ పార్టీకి ఆయన పార్టీ మారుతారని పూర్తిగా తెలిసిపోయింది. కానీ ఎప్పుడో తేలడం లేదు. దీంతో పార్టీలోని కొందరు సీనియర్ నేతలు విస్మయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్ కొందరు కాంగ్రెస్ సీనియర్లను కలిసి ఢిల్లీలో జరిగిన పరిణామాలను వివరించడంతోపాటు పార్టీలో భవిష్యత్లో తన వ్యవహార శైలి గురించి కూడా వివరణ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే తనతో వచ్చే నేతల వివరాలను ఇస్తున్నారట.
వారినీ కలిశారు
తాను ఏ పరిస్థితుల్లో పార్టీలోకి వస్తుందీ వారికి చెబుతున్నట్లు, రాహుల్ను కలిసిన విషయాన్ని కూడా ధ్రువీకరిస్తున్నట్లు తెలిసింది. దీపావళి రోజున ఆయన డీకే అరుణను కలిశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలను కూడా రేవంత్ కలిసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొందరితో ఫోన్లో కూడా సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది.
అనుచరులకు వివరణ
ఇంకోవైపు సొంత నియోజకవర్గం కొడంగల్కు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకూ తన నిర్ణయాన్ని వివరించేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. పలువురు స్థానిక నేతలు అధికార తెరాసలో చేరిన నేపథ్యంలో ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తన స్వగృహంలో కార్యకర్తలు, నాయకులతో రేవంత్ భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను వారికి వివరించి కార్యాచరణను ప్రకటించనున్నారు. మరోవైపు ఏపీ మంత్రి, టిడిపి నేత నారా లోకేష్ హైదరాబాద్ వచ్చారు. రేవంత్ కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనను చంద్రబాబు రంగంలోకి దింపి ఉంటారని అంటున్నారు.