ఓటుకు నోటు, యూజ్ అండ్ త్రో, రేవంత్: బాబుపై మోత్కుపల్లి ఘాటుగా, ఏపీ సీఎం కౌంటర్
హైదరాబాద్/విజయవాడ: ఓటుకు నోటు కేసు కారణంగానే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి వెళ్లిపోయారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చంద్రబాబు తనకు అపాయింటుమెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు.
దళితుడు, పేదవాడు అయినందునే తనకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో చంద్రబాబు చూసుకుంటే పార్టీ ఉంటుందని లేదంటే లేదన్నారు. రేవంత్ రెడ్డికి సీనియర్లకు ఇవ్వని ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్టీ పరిస్థితిని చూసి బాధపడే తాను తెరాసలో విలీనం చేయాలని సూచించానని చెప్పారు. రేవంత్ ఇంట్లో పెళ్లికి అన్నీ చేసిన చంద్రబాబు, తన ఇంట్లో పెళ్లికి ఆలస్యంగా వచ్చారన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్తో వెళ్లాలా లేక తెరాసతో వెళ్లాలా అనే పరిస్థితి వస్తే తమ మిత్రుడైన కేసీఆర్ వెంటే వెళ్లాలని భావిస్తామన్నారు. అదే సూచన తాను చేశానన్నారు. తాను గవర్నర్ పదవిని ఎప్పుడూ అడగలేదన్నారు. రాజ్యసభ ఇవ్వనందుకు గవర్నర్ ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పారన్నారు.
కులం, డబ్బు రాజకీయాల్లో చాలా ముఖ్యమైపోయాయన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు మాట తప్పారన్నారు. చంద్రబాబును కొందరు యూజ్ అండ్ త్రో అని ఆరోపిస్తారన్నారు. తాను పార్టీని వదిలిపెడతానని ఎప్పుడూ చెప్పలేదని, పార్టీ పగ్గాలు అప్పగిస్తే నడిపించే సామర్థ్యం తనకు ఉందన్నారు. మహానాడుకు అందరినీ పిలిచి తనను ఎందుకు పిలవలేదన్నారు. రేవంత్ రెడ్డి పార్టీని నాశనం చేసి వెళ్లిపోయాడన్నారు. సీనియర్లను కాదని అతనికి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారన్నారు.
అసంతృప్తులపై చంద్రబాబు అసహనం
తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని మహానాడులో సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీలో ఎదిగిన వ్యక్తులో పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను విమర్శించే వాళ్లు ఓసారి పక్క పార్టీలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఇతర పార్టీల్లో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. పదవులు ఆశించి పొందలేని వారే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కొందరు పార్టీ వీడినా నష్టం లేదని తేల్చి చెప్పారు.