చెప్పు తమ్మీ అన్నా, నాకు తిక్కపుట్టింది: రేవంత్పై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ పైన తనదైన శైలిలో రెచ్చిపోయారు. అదే విధంగా సీఎం కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేశారు.
కేసీఆర్కు కొత్త చిక్కు: రాజీనామా ఆమోదిస్తే రేవంత్ గట్టి షాకివ్వక తప్పదు?
Recommended Video
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడారు. తమకు యుద్ధం అంటే భయం లేదని, రాజకీయం అంటే అసలే భయం లేదన్నారు. 35 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు.
కాంగ్రెస్లోకి వెంట వచ్చిన వారు రేవంత్ రెడ్డికి షాకిస్తారా?
చంద్రబాబుపై ప్రశంసలు
చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను మీ దళిత బిడ్డను, ఏ ప్రాంతంలో పని చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని అధినేతకు స్పష్టం చేశారు. కోట్లాది యువత మన వెంట ఉందని చెప్పారు. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఏమీ లేని ఏపీలో, అప్పున్న రాష్ట్రంలో అన్నీ ఉన్నట్లుగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు.
అప్పటిలాగే పాలన చేస్తున్నారు
లోటు బడ్జెట్ ఉన్నా బాగా పాలిస్తున్నారని మోత్కుపల్లి.. చంద్రబాబును అన్నారు. గతంలో ఎలా పాలిస్తున్నారో అలాగే ఉందన్నారు. పేదవాడికి ఇళ్లు ఎన్టీఆర్ మొదలు పెట్టారని, ఇప్పుడు దానిని అందరూ కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పేదవాడిని కుర్చీపై కూర్చోబెట్టిన సిద్ధాంతం టీడీపీది అన్నారు.
మోసం చేశారని రేవంత్ పైన నిప్పులు
కొంతమందిపై విశ్వాసం ఉంచితే వారు మోసం చేసారని, నమ్మకద్రోహులు అంటూ రేవంత్ పైన విమర్శలు గుప్పించారు మోత్కుపల్లి. ఇలా చాలామంది మోసం చేసారని, కానీ టీడీపీ ఎదురొడ్డి నిలిచిందని చెప్పారు. రేవంత్ పైన తమకు వ్యక్తిగతంగా కోపం లేదన్నారు.
రాహుల్ గాంధీని కలవడంపై నిలదీశా
ఈ సందర్భంగా, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ భేటీకి ఆయన హాజరైన విషయాన్ని మోత్కుపల్లి గుర్తు చేసుకున్నారు. భేటీలో తాను రేవంత్ను రాహుల్ గాంధీని కలిసిన విషయమై నిలదీశానని చెప్పారు.
చెప్పు తమ్మీ అని అడిగా, బాబుకు చెప్పావా అని ప్రశ్నించా
రాహుల్ను కలిశావా లేదా చెప్పమని అడిగానని, అంటే రేవంత్ మాత్రం సమాధానం చెప్పలేదని మోత్కుపల్లి గుర్తు చేసుకున్నారు. పత్రికల్లో మీరు రాహుల్ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయని, చెప్పు తమ్మీ ఫర్వాలేదు.. ప్రజాస్వామ్యంలోనీకు కలిసే హక్కు ఉంది, కానీ చంద్రబాబును అడిగి చేశావా అని తాను రేవంత్ను అడిగానని మోత్కపల్లి చెప్పారు.
నాకు తిక్కపుట్టింది
రాహుల్ గాంధీని కలిశావా అని తాను అడిగితే.. నేను సార్తో చెప్పుకుంటానని, సార్ వద్దనే తేల్చుకుంటానని రేవంత్ చెప్పాడని మోత్కుపల్లి అన్నారు. అప్పుడు నాకు తిక్కపుట్టిందన్నారు.
ఒకటికి నాలుగుసార్లు అడుగుతాం, నీకు ఎవరిచ్చారు
చంద్రబాబు వద్ద తాము 35 ఏళ్లుగా పని చేస్తున్నామని మోత్కుపల్లి అన్నారు. మేం ఏ పని అయినా చేయాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆయన వద్ద అనుమతి తీసుకుంటామని చెప్పారు. కానీ నీకు రాహుల్ గాంధీని కలిసేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మోత్కుపల్లి గట్టిగా ప్రశ్నించారు. మన పార్టీలోకి వచ్చి మన కార్యక్రమాలను ఆయనవిగా చెప్పుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు.