బాబు బంపర్ ఆఫర్: మోత్కుపల్లికి గవర్నర్ పదవి?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను త్వరలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్గా నియమించవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయమై సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కేంద్రంలో, ఏపీలో పొత్తుతో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, తెలంగాణలో టీడీపీ నేతలకు గవర్నర్ పదవి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో భాగంగా మోత్కుపల్లిని గవర్నర్ గిరి వరించవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఆయనకు రాజ్యసభ సీటు విషయంలో చుక్కెదురైంది.
అయితే, అధికారంలోక వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలు రాష్ట్రాలలో గవర్నర్ పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మోత్కుపల్లికి అవకాశం రావొచ్చునని తెలుస్తోంది.