మోత్కుపల్లికి గవర్నర్ గిరీ ఖాయమైపోయింది! అయితే మళ్లీ ఓ ట్విస్ట్
హైదరాబాద్ : 'ఏనాడో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..' అన్న తరహాలో.. మొత్తానికి ఇన్నాళ్లకు మోత్కుపల్లి మొహంలో ఓ కొత్త కళ సంతరించుకోబోతుంది. గవర్నర్ గిరీపై చాన్నాళ్లుగా ఆశలు పెట్టుకున్న మోత్కుపల్లి.. ఇక గవర్నర్ అయినట్లేనన్న సంకేతాలు అందుతున్నాయి.
తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవి కాలం ముగియడంతో.. ఇప్పుడు ఆ స్థానాన్ని మోత్కుపల్లితో భర్తీ చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు దాదాపుగా ప్రధాని మోడీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. వినాయక చవితి తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ గిరీ కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కానీ.. ఇక్కడా ఓ పెద్ద ట్విస్టు :
మోత్కుపల్లికి తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించడం పట్ల కేంద్రం సానుకూలంగానే ఉన్నా.. గుజరాత్ మాజీ సీఎం నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు సమాచారం. ఇటీవలే సీఎంగా రాజీనామా చేసిన ఆనందీబెన్ కూడా తమిళనాడు గవర్నర్ పదవి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆ పదవి మోత్కుపల్లికి ఇవ్వాలా.. ఆనందీబెన్ కు ఇవ్వాలా అన్న విషయంలో కేంద్రం డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
నిజానికి మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందీబెన్ కు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తున్నా.. ఆనందీబెన్ మాత్రం తమిళనాడు వైపే మొగ్గు చూపుతున్నారట. తమిళనాడు గవర్నర్ పదవి కోసం బీజేపీ అధిష్టానాన్ని గట్టిగానే అడుగుతున్నారట. దీంతో ఇప్పటికే పదవి ఖాయమన్న ఆశల్లో మునిగిపోయిన మోత్కుపల్లికి ఇదో అనూహ్య అవాంతరంగా పరిణమించింది. ప్రస్తుతం రోశయ్య స్థానంలో అదనపు గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అదనపు బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.