ఆంధ్రావాళ్లని తిట్టడమే: మోత్కుపల్లి, ఉగ్రవాదిలా: కేసీఆర్పై రావెల తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రావాళ్లను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని అని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం మండిపడ్డారు. సెక్షన్ 8 పైన తెలంగాణ రాష్ట్ర సమితి అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.
ఆంధ్రావాళ్లను తిట్టడం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనమన్నారు. సెంటిమెంటును ఇంకా వాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. కాగా, గవర్నర్ తెరాసలో చేరవచ్చుననే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ఊహాగానాలేనని అంటున్నారు.
హైదరాబాదులో ఏపీ ప్రజలకు రక్షణ లేదు: గాలి
హైదరాబాదులో ఏపీ ప్రజలకు రక్షణ లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. ఏపీలోని టెయిల్ పాండ్ వద్దకు తెలంగాణ పోలీసులు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్పై రావెల కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు
కేసీఆర్ పైన రావెల కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉగ్రవాదిలా, తీవ్రవాదిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులో యుద్ధవాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సెక్షన్ 8 అమలు చేయాలన్నారు.
ఏపీ ఉద్యోగులకు హైదరాబాదులో రక్షణ లేదన్నారు. ఏపీలో రాజకీయ సంక్షోభం సృష్టించి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి సెక్షన్ 8కు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేయకుంటే ఏపీ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మంత్రి రావెల కిషోర్ అన్నారు. హైదరాబాదులో ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు. తెరాసతో వైసీపీ చీఫ్ జగన్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.