టిడిపి పరిస్థితికి మోత్కుపల్లి కంటతడి!, దత్తాత్రేయకు రాయలసీమ నేతల బిరుదు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టిడిపి పరిస్థితిని తల్చుకొని మోత్కుపల్లి కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో టిడిపి పరిస్థితి దిగజారిపోతోందనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయమై... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది.
పలువురు నేతలు వేదికపై ఉండగా... మోత్కుపల్లి మాట్లాడుతూ... ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇలా అయిపోయిందని ఉద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని బతికించుకోవాలని మోత్కుపల్లి సూచించారు. త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రజలను కలుస్తానని చెప్పారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి - టిడిపి గెలుపు ఖాయమని మోత్కుపల్లి సహా ఇతర నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. గ్రేటర్ నుంచి టిడిపి బలోపేతాన్ని తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారని అంటున్నారు.
దత్తాత్రేయకు 'బిసి బంధు' బిరుదు
కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయకు ‘బీసీ బంధు' బిరుదు ప్రదానం చేశారు. రాయలసీమ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దత్తాత్రేయకు ఈ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు.