బాబు అలా చేసి ఉండాల్సింది కాదు: రేవంత్పై మోత్కుపల్లి షాకింగ్, గవర్నర్ ఆశలు వదిలేశా
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వంటి వాడికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పెద్ద పోస్టు ఇచ్చి ఉండాల్సింది కాదని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రేవంత్కు టిడిపి అధినేత చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పట్లో కట్టబెట్టారు. ఇటీవల రేవంత్ కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. ఆయనకు ఆ పదవి ఇవ్వాల్సింది కాదన్నారు. మీడియా కూడా ఆయనకు బాగా హైప్ తెచ్చిందని చెప్పారు.
రేవంత్ నాయకుడే కాదు
రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సరిగా లేదని, అంటే ఆయనకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. రేవంత్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ చేసిన చిన్న పొరపాటు అన్నారు. అసలు ఆయన నాయకుడే కాదన్నారు.
చంద్రబాబుకు చెప్పా
సామాన్య ప్రజలతో మాట్లాడని వ్యక్తి, ఫోన్ చేస్తే స్పందించని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడని మోత్కుపల్లి ప్రశ్నించారు. రేవంత్ విషయంలో తాను ఎప్పుడూ మౌనంగా ఉండలేదని చెప్పారు. అయితే ఆయనకు కొంత సమయం ఇచ్చారన్నారు. తమ పార్టీ అధినేతకు కూడా ఆయన గురించి పలుమార్లు చెప్పానని తెలిపారు.
బాబుకు నమ్మకం ఉండటం వల్లే ఇచ్చారు
రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉండటం వల్లే ఆనాడు చంద్రబాబు ఆయనకు అంత పెద్ద పదవి కట్టబెట్టారని మోత్కుపల్లి చెప్పారు. అలాంటి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధికి కాకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపించారు. ఆయనకు నోరు ఎక్కువ అన్నారు.
గవర్నర్ పదవిపై ఆశలు వదులుకున్నా
గవర్నర్ పదవి కోసం తాను మూడేళ్లుగా ఎదురు చూశానని, ఇప్పుడు దానిపై ఆశలు వదులుకున్నానని మోత్కుపల్లి చెప్పారు. దాని గురించి ఆలోచించడం మానేశానని చెప్పారు. దాని గురించి ఆలోచించకపోవడమే తన ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. తనకు గవర్నర్ పదవి అనేది చంద్రబాబు ఆలోచనే అని, తనకు ఆ పదవి దక్కేందుకు ఆయన ఎంతో కృషి చేసినా ఫలితం లేదన్నారు.
కేసీఆర్తో పొత్తు అని నేను అనలేదు
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని రేవంత్ రెడ్డి ఆనాడు చెప్పడం సరికాదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. అధిష్టానం అనుమతి లేకుండా అలా ఎలా మాట్లాడుతారని చెప్పారు. తాను కేసీఆర్ లేదా తెరాసతో పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పలేదని తెలిపారు.