మోత్కుపల్లికి ఝలక్, టీడీపీ నుంచి బహిష్కరణ: గవర్నర్ పదవిపై కొత్త విషయం చెప్పిన ఎల్ రమణ
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు, యూజ్ అండ్ త్రో, రేవంత్: బాబుపై మోత్కుపల్లి ఘాటుగా, ఏపీ సీఎం కౌంటర్
మోత్కుపల్లి విమర్శలు తారాస్థాయికి చేరాయన్నారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదన్నారు. విపరీత ధోరణితో ఆయన పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పార్టీని బలహీనపరిచే విధంగా ఆయన మాట్లాడారని ఆక్షేపించారు. గవర్నర్ పదవి రాలేదని గొడవ మొదలు పెట్టారన్నారు. ఎన్టీఆర్కు కేసీఆర్ ప్రతిరూపం అన్నారని చెప్పారు.
తమిళనాడు గవర్నర్ పదవి కావాలని మోత్కుపల్లి పట్టు
గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని రమణ చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని తెలిపారు. అయితే మోత్కుపల్లి మాత్రం తనకు గవర్నర్ పదవి ఇస్తే తమిళనాడు కావాలని కోరారని ఆసక్తికర విషయం వెల్లడించారు. అంతకుముందు మోత్కుపల్లి అధినేతపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబుపై ఇటీవల విమర్శలు
చంద్రబాబు దొరకని దొంగ అని, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సరెండర్ అయ్యారని, ఈ కేసును త్వరగా విచారించాలని మోత్కుపల్లి ఇటీవల విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే తాను ఏపీలో రథయాత్ర చేపడతానని, చంద్రబాబు చరిత్రలో నల్లటి పేజీ ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు యూటర్న్ తీసుకున్నారని, మళ్లీ ఇప్పుడు హోదా అడగడానికి సిగ్గులేదా అన్నారు. చంద్రబాబును ప్రజలు పాతాళంలోకి తొక్కేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాజ్యసభ సీటు నుంచి పోలవరం వరకు
చంద్రబాబు రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. టీడీపీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో వందల కోట్ల కమిషన్ కొట్టేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఓటు వేయవద్దన్నారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. మాల మాదికల మధ్య, బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టారని, చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చు పెట్టారన్నారు.
పవన్, జగన్లతో పోల్చుతూ బాబుపై ఆగ్రహం
ఎన్టీఆర్ వద్ద టీడీపీ జెండాను దొంగతనం చేశారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపులకు రిజర్వేషన్ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని లేదంటే రాజీనామా చేయాలన్నారు. పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు సొంత జెండా పెట్టుకొని ముందుకు పోతున్నారని, వారు మగాళ్లని, చంద్రబాబుది మాత్రం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అన్నారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని, ఎన్టీఆర్ను కూడా అలాగే చేశారన్నారు.