కెసిఆర్ను అభినందించిన మోత్కుపల్లి: సిఎం మెప్పుకోసమేనని శశిధర్ రెడ్డి
హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తున్న కృషికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అభినందించారు. యాదగిరిగుట్టను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలపాలనుకోవడం బాధాకరమన్నారు. యాదగిరిగుట్టను సిద్దిపేటలో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని మోత్కుపల్లి హెచ్చరించారు. యాదగిరిగుట్టును సిద్ధిపేటలో కలపకుండా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విచక్షణారహితంగా ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెప్పు కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన సోమవారం ఆరోపించారు.
నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించడం సరి కాదని ఆయన మీడియాతో అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై, ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.