ఎన్టీఆర్నే విస్మరిస్తారా: కెసిఆర్ను ప్రశ్నించిన మోత్కుపల్లి
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర్గీయ ఎన్టీ రామారావును విస్మరించడంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రశ్నించారు.
గత ఐదు రోజులుగా హైదరాబాదులో ప్రపంచ తెలుగుమహాసభలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహాసభల్లో ఎన్టీఆర్ను ఎక్కడా ప్రత్యేకంగా గుర్తించలేదు. దానిపై మోత్కుపల్లి కొన్ని వ్యాఖ్యలు చేశారు
రాజకీయ గురువునే విస్మరిస్తారా..
ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర్గీయ ఎన్టీ రామారావును విస్మరించడం బాధాకరమని మాజీ మంత్రి, తెలంగాణ టిడిపి నేత సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుచెప్పిన గురువుకు నమస్కరించిన కేసీఆర్కు రాజకీయ గురువుకు దండం పెట్టవల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
దానిపై తెలుగువారంతా బాధపడుతున్నారు...
తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ను విస్మరించడంపై ప్రపంచంలోని తెలుగువారంతా బాధపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్కు రాజకీయ జీవితాన్నిచ్చాడు..
కేసీఆర్తో సహా ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అని మోత్కుపల్లి అన్నారు. ఎన్టీఆర్ను విస్మరించడం బాధాకరమన్నారు.
మందకృష్ణ అరెస్టుకు ఖండన..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని మోత్కుపల్లి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇంకా నాన్చడం సరికాదని, మాదిగ జాతిని చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు. కేబినెట్లో కూడా ఒక్క మాదిగ కులస్తుడు లేడని, కేసీఆర్ వైఖరి మారకపోతే తగిన మూల్యం చెల్లిస్తాడన్నారు.