మోకాళ్ల నొప్పులున్నా బాబు ఓటమి కోసం తిరుమల మెట్లెక్కుతా, వారిద్దరు దొంగలు: మోత్కుపల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అని విమర్శించారు. ఏపీని చంద్రబాబు అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు.
యాదాద్రి జిల్లా ఆలేరులో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతోంది వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. చంద్రబాబు హోదా కోసం పోరాడటం లేదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కాపులకు, బీసీలకు బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థలోని చీడ పురుగు చంద్రబాబు అన్నారు.
టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. తనకు మోకాళ్ల నొప్పి ఉందని, అయినప్పటికీ తిరుపతి మెట్లు ఎక్కి చంద్రబాబ ఓడిపోవాలని మొక్కుకుంటానని చెప్పారు.