పవన్ పంచన మోత్కుపల్లి ...! తెలంగాణా పగ్గాలు ఇవ్వనున్న పవన్..??
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ముద్రపడ్డ మోత్కుపల్లి నర్సింహులు అనూహ్యంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారు. పార్టీనుండి దూరంగా ఉంటున్న మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం గురించి మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. తాను చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తుల పునరేకీకరణ కోసం పనిచేస్తానని, చంద్రబాబు ఓటమే తన లక్ష్యమని చెప్తున్న మోత్కుపల్లి ఏ రాజకీయ పార్టీలో చేరతాడో మాత్రం ఇంతవరకూ బహిర్గతం చేయలేదు. జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ తో జతకట్టి తెలంగాణా పార్టీ పగ్గాలు తీపుకునే అవకాశం పై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం పై స్పష్టత ఇవ్వనున్న పవన్ భేటీ..
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఓ ఆధారం దొరికింది.తెలుగుదేశం నుంచి బహిష్కరణకు గురై నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ ఆయనకు లిఫ్ట్ ఇవ్వడానికి ఓ నాయకుడు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ నుంచి పిలుపు లేక,కాంగ్రెస్ లో చేరలేక,చిన్నా చితక పార్టీల వైపు చూడక నిశబ్దంగా ఉన్న ఆయనకు మైక్ ఇవ్వడానికి గబ్బర్ సింగ్ సై అన్నాడు.అవును మోత్కుపల్లి నర్సింహులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడానికి రెఢీ అయ్యారు.ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి పవన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.ఆయనకు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు.. ఉద్వాసనకు గురి చేసిన అనుచిత వాఖ్యలు..
వీరిద్దరి భేటీ తర్వాత మోత్కుపల్లి రాజకీయ జీవితంపైన స్పష్టమైన ప్రకటన రానున్నది.తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మోత్కుపల్లి నర్సింహులు తన రాజకీయ జీవితాన్ని ఒక కొలిక్కి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.తనకు ఎలాంటి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మోత్కుపల్లి సొంత పార్టీతో వివాదానికి దిగారు.టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వ్యాఖ్యానించడంతో పాటు చంద్రబాబునాయుడిపైన తీవ్ర విమర్శలు చేయడంతో ఆ పార్టీ ఆయనను బహిష్కరించింది. దీంతో తెలుగుదేశంపైన యుద్ధం ప్రకటించిన ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎపీలో ఉద్యమం తీస్తానని బయలుదేరారు.
బాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన మోత్కుపల్లి.. ఆశించిన మైలేజ్ మాత్రం జీరో..
బాబును ఓడించాలని కోరుతు తిరుపతి కొండపైకి నడ్చి వెళ్లిన ఆయన ఆంధ్రాలో దళితులను కూడగడతానని చెప్పుకొచ్చారు. అయితే అనుకున్న స్థాయిలో ఆంధ్రా నుంచి స్పందన రాకపోవడంతో మోత్కుపల్లి తన రూట్ మార్చారు. చంద్రబాబుపైన రాజకీయ యుద్ధాన్ని పక్కన పెట్టి తెలంగాణలో తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నర్సింహులు ప్రయత్నించినప్పటికి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ తో పాటు తెలంగాణ జనసమితి పార్టీల్లో చేరడం ఆయనకు ఇష్టం లేదు.దీంతో వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మోత్కుపల్లి భావించారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారు. నర్సింహులను పవన్ కళ్యాణ్ కూడా పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
జనసేన పార్టీలో సముచిత స్థానం దక్కుతుందా..? ప్రజలు ఆదరిస్తారా అన్నదే ప్రశ్న..!!
దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పవన్ ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకిగా మారిన మోత్కుపల్లిని ఆంధ్రాలో ఉపయోగించుకోవచ్చునని జనసేన అధినేత భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి మోత్కుపల్లి ఉపయోగపడతారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే వీరిద్దరి భేటీ తర్వాత నర్సింహులు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసే అవకాశముంది. మొత్తానికి మొత్కుపల్లి నర్సింహులు ఎంట్రీతో జనసేన పార్టీకి తెలంగాణలో ఎలాంటి బలం వస్తుందో వేచి చూడాల్సిందే.