భార్గవి బలైపోయిందిలా..: మోత్కురు హత్య ఉదంతంలో వెలుగుచూసిన నిజాలు
మోత్కూరు: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే అతనికి పెళ్లై విడాకులయ్యాయని తెలిసినా.. ఆమె అతన్ని ప్రేమించింది. అతను కూడా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కానీ ఆ మాట తప్పాడు.
ట్విస్ట్: లవర్ను చంపిన తెల్లారే మరో యువతితో వివాహం, మొదటి భార్యకు విడాకులు
మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇదేంటని నిలదీసినందుకు ప్రియురాలికి మరణశిక్ష విధించాడు. యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూరులో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
ఎవరీ ఇద్దరు..:
మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య-లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె భార్గవి(23), మోత్కూరు మండల బుజిలాపురానికి చెందిన కాసగాని సత్తయ్య-ఆండాలు దంపతుల కుమారుడు నరేందర్(25) అలియాజ్ నందు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరైనా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
అక్కడే పరిచయం.. ప్రేమ:
డిగ్రీ వరకు చదివిన భార్గవి ఆత్మకూర్ లోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు నరేందర్. అంతకుముందు పెట్రోలు బంకులో కొన్నాళ్లు పనిచేశాడు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆపై ప్రేమగా మారింది.
మరో యువతితో వివాహం:
నరేందర్కు అంతకుముందే వివాహం కాగా.. పెళ్లయిన 15రోజులకే ఆమెను వదిలించుకున్నాడు. ఆ తర్వాత భార్గవికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నరేందర్.. ఇటీవలే జనగాం జిల్లా గుండాల మండలం సుద్దాలకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ నెల 4న పెళ్లి కూడా పెట్టుకున్నారు.
భార్గవిని నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు:
నరేందర్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో భార్గవి అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకుందామంటూ నమ్మించిన నరేందర్.. శనివారం భార్గవిని బుజిలాపురం సమీపంలోని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే బండరాయితో ఆమె తలపై మోది హత్య చేశాడు. అనంతరం వ్యవసాయ బావి వద్దగల మొరం కుప్పలో గోతి తవ్వి పూడ్చి వేశాడు.
ఇలా వెలుగులోకి..:
హత్యానంతరం ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వచ్చాడు నరేందర్. ఆదివారం పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి మరో యువతి మెడలో తాళికట్టాడు.
మృతురాలు భార్గవి తండ్రి లక్ష్మయ్య.. తన కూతురు కనిపించడంలేదని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్పైనే ఆయన అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో నరేందర్ తానే హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు.
మృతదేహాన్ని వెలికితీశారు..:
నరేందర్ నేరం అంగీకరించిన తర్వాత.. అతన్ని వెంటపెట్టుకుని మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలం వద్దకు వెళ్లారు పోలీసులు. వ్యవసాయ బావివద్ద ఓ గుంతలో మొరం కప్పి ఆమెను పూడ్చినట్టు గుర్తించారు. ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.