ప్రచారం లో దూసుకెళ్తున్న మోత్కుపల్లి..! ఆలేరులో కీలకం కానున్న ఓటు బ్యాంక్..!
హైదరాబాద్ : రాజకీయాల్లో వాడి వేడి వ్యాఖ్యలు చేసే మోత్కుపల్లి నర్పింహులు కొద్ది రోజులుగా మీడియాకు దూరం అయ్యారు. మీడియాకు దూరమైన మోత్కుపల్లి తన సొంత నియోజకవర్గంలో ప్రచారంలో బిజీగా మారిపోయారు. ఆలేరు ప్రజలను కలుసుకోవడం, వారి కష్టాలను తెలుసుకోవడం, తనకు అవకాశం ఇస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడంతో పాటు ప్రజా క్షేత్రంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
మోత్కుపల్లి ప్రచారంతో అదికార పార్టీతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలేరు నియోజక వర్గంలో ఉన్న సుమారు 40వేల వరకూ ఉన్న ఎస్సీ ఓటర్లను మొత్కుపల్లి ప్రభావితం చేయగలిగితే విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. దీంతో గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలకు మోత్కుపల్లి చెమటలు పట్టిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆలేరులో దడ పుట్టిస్తున్న మోత్కుపల్లి..! గులాబీ, కాంగ్రెస్ పార్టీలో మొదలైన గుబులు..!!
తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగి, కొద్దిరోజుల కిందట బహిష్కరణకు గురయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తనను కావాలనే దూరం పెడుతున్నారని టీడీపీ నేతలపై, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి టీడీపీపై ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత జనసేనకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో మోత్కుపల్లికి జనసేన తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు.
బీఎల్ఎఫ్ ఆదరణ..! దూసుకెళ్తున్న మోత్కుపల్లి..!!
మోత్కుపల్లి జనసేనాని పవన్ కల్యాన్తో భేటీకి కూడా ప్రయత్నాలు జరిపారు. ఏమైందో ఏమో వీరి మధ్య భేటీ జరగలేదు. తన అనుచరుల అభ్యర్ధన మేరకు తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించిన నర్సింహులు ఊహించని విధంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత మోత్కుపల్లికి బీఎల్ఎఫ్ మద్దతు తెలిపింది. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
ఇదే ఆఖరు సారి..! అవకాశం ఇవ్వాలంటున్న నర్పింహులు..!!
తాజా పరిస్థితుల నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేస్తున్న ఆలేరులో పరిస్థితిపై ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఇక్కడ గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గొంగడి సునీత విజయం సాధించారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆమె పేరు ఉండడంతో అప్పటి నుంచి సునీత జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మహాకూటమి తరపున ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ పార్టీ తరపున బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రభావం చూపించబోతున్న ఓటర్లు..! మోత్కుపల్లికి కలిసొస్తున్న సామాజిక వర్గం..!!
ఒకవైపు సునీత టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని అనుకుంటుండగా, భిక్షమయ్య గౌడ్ ప్రభుత్వ వ్యతిరేకత తనకు బాగా అనుకూలిస్తుందని.. 30వేల దాకా ఉన్న గౌడ సామాజికవర్గం ఓట్లన్నీ తనకే పడతాయని ఆయన విశ్వాసంగా ఉన్నారు. ఇంతలో వచ్చిన మోత్కుపల్లి వీరి విజయావకాశాలపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజవర్గంలో దాదాపు 40వేలదాకా ఉన్న ఎస్సీ ఓట్లలో మెజారిటీ ఆయనకే పడే ఛాన్స్ ఉండడంతో పాటు, గతంలో చేసిన పనులు మోత్కుపల్లికి అనుకూలంగా మారనున్నాయని అక్కడ చర్చ జరుగుతోంది.