నారా భువనేశ్వరికి భయం, దళితులు, బీసీలు జడ్జీలు కాకుండా.: బాబుపై మోత్కుపల్లి సంచలనం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారని, ఆ తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కాళ్ల బేరాలు చేశారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ ఎప్పుడూ దళితుల పట్ల బేధభావం చూపలేదని అన్నారు. మంగళవారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
Recommended Video
ఈ సందర్భంగా ఎన్టీఆర్.. మోత్కుపల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో, ఆయనతో భోజనం చేస్తున్న ఫొటోలను చూపించారు మోత్కుపల్లి. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దళితులకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు.
చంద్రబాబును తప్ప ఎవర్నైనా గెలిపించండి
చంద్రబాబుకు మాల, మాదిగలు ఎవ్వరూ ఓటు వేయ్యొద్దని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. బలహీన వర్గాలు, కమ్మ కులస్తులు కూడా చంద్రబాబు ఓటు వేయొద్దని అన్నారు. ఎన్టీఆర్ వారసులను గెలిపించాలని, చంద్రబాబును తప్ప ఎవరినీ గెలిపించినా మంచిదేనని అన్నారు. చంద్రబాబు తనకేలాంటి సాయం చేయలేదని, తాను ఏ పార్టీలోకి వెళ్లకపోయినా బతకగలనని అన్నారు.
బాబంటే భువనేశ్వరికి భయం
ఆలేరు ప్రజలు తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు ఓటమి భయంతో టీడీపీలో చేరారని అన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ అల్లుడు కావడంతోనే అదృష్టం పట్టుకుందని అన్నారు. భువనేశ్వరితో ఏ బొందలగాడు పెళ్లి కుదిర్చాడోనని అన్నారు. చంద్రబాబు అంటే తనకు భయమని చాలాసార్లు భువనేశ్వరి తనకు చెప్పారని మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు నీతిమంతులను ఉండనియ్యరని ఆరోపించారు.
మోడీకి విజ్ఞప్తి-కేసీఆర్ దెబ్బకు
చంద్రబాబు నల్లికుట్టినట్లు కుడతాడని, దొంగే గానీ దొంగలా ఏర్పడడని మోత్కుపల్లి ఆరోపించారు. చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపించాలని తాను ప్రధాని మోడీని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు మిత్రద్రోహి కాబట్టే మోడీ అపాయింట్ ఇవ్వలేదని అన్నారు. పదేళ్లు ఉండాల్సిన చంద్రబాబు.. కేసీఆర్ దెబ్బకు హైదరాబాద్ వదిలిపారిపోయారని అన్నారు.
చంద్రబాబు నుంచి హాని
పార్టీ వీడిన రేవంత్ రెడ్డిన ఏమనడు కానీ, తనపై విమర్శలు చేయిస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోతోందని, సిద్ధాంత పరంగా విభేదాలున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లలేమని, అందుకే టీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్దామని తాను చెప్పానని అన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్, ఆయన బిడ్డలు, మంత్రులు అంతా మనకు తెలిసినవారే కాదా అని చెప్పారు. టీడీపీ దానికదే అంతరించిపోవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని మోత్కుపల్లి ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని అన్నారు.
పవన్, బీజేపీకి బాబు ద్రోహం
చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లాడా? పవన్.. చంద్రబాబు ఇంటికి వెళ్లాడా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన పవన్ కళ్యాణ్ ను కూడా బాబు మోసం చేశారని అన్నారు. ఇప్పుడు పవన్ పైనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీకి మిత్ర ద్రోహం చేశారని అన్నారు. జగన్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై ఆరోపణలు కనిపిస్తున్నాయని.. చంద్రబాబు, ఆయన కొడుకు చేసే పనులు చీకట్లోనే ఉన్నాయని అన్నారు. చంద్రబాబుపై 29కేసులు ఉన్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరతున్నట్లు తెలిపారు. తన వెనుక ఎవరూ లేరని, తానే ఉన్నానని మోత్కుపల్లి చెప్పారు.
బాబు లాంటి భ్రష్టుడి కోసం
చంద్రబాబు లాంటి భ్రష్టుడి కోసం తన జీవితాన్ని ధారపోశానని అన్నారు. 50సార్లు ఫోన్లు చేసినా తనకు చంద్రబాబు నుంచి స్పందన రాలేదని అన్నారు. చంద్రబాబు పాపాల బైరవుడని, నీతి మంతులను ఉండనివ్వరని.. ఇప్పుడు తన వంతు వచ్చిందని మోత్కుపల్లి చెప్పారు. తాను పదవుల కోసం ఆరాటపడేవాడినే అయితే.. ఇప్పటికే ఏదో ఒక పార్టీలో చేరవాడినని అన్నారు.
దళితులు, బీసీలు జడ్జీలు కాకుండా..
వెంకన్నస్వామి, నర్సింహస్వామి ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందని మోత్కుపల్లి చెప్పారు. ఏపీలో చంద్రబాబును ఓడించడానికి అక్కడ పర్యటిస్తానని, ఓడిపోయిన తర్వాత కూడా పర్యటిస్తానని తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు వేధింపుల వల్లే చనిపోయాడని ఆరోపించారు. చంద్రబాబు నమ్మక ద్రోహి అని ఎన్టీఆరే తనకు చెప్పారని తెలిపారు. చంద్రబాబు దళిత, బీసీ ద్రోహి అని అన్నారు. దళితులు, బీసీలు హైకోర్టు జడ్జీలు కావడానికి అర్హులు కారని ఉత్తరాలు కూడా చంద్రబాబు రాశారని, తన వద్ద ఉన్నాయని.. బయటపెడతానని మోత్కుపల్లి చెప్పారు.