మోత్కుపల్లి భావోద్వేగం: 'సిద్ధంగా లేం', టీఆర్ఎస్పై బర్రె సామెత
హైదరాబాద్: మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవనలో తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు హాజరైన తెలంగాణ సీనియర్ మోత్కుపల్లి నరసింహులు భావోద్వేగంతో మాట్లాడారు.
తెలంగాణలో మేం అభద్రతకు లోనవుతున్నామని తెలిపారు. మిమ్మల్ని(చంద్రబాబు నాయుడు) వదిలిపెట్టేందుకు మేం సిద్ధంగా లేమని ఆయన పేర్కొన్నారు. 27 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలమయ్యామని, ఆ తర్వాత మంత్రులం కూడా అయ్యామని చెప్పుకొచ్చారు.
పసుపు జెండా కప్పుకొని సచ్చిపోవడానికి అవకాశం ఇవ్వండని కాస్తంత ఉద్వేగంతో మాట్లాడారు. సచ్చేవరకూ పసుపు జెండాతోనే ఉంటామని, కానీ మేం వేరోకచోటికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతపైనే ఉందని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాస్తంత శ్రమైనా ఆ బాధ్యత ఆయన తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనిలో పని టీఆర్ఎస్పై కూడా విమర్శలు చేశారు. 'ఇంటికి కొత్త బర్రె వస్తే ఇంట్లో వాళ్లంతా కలిసి పెంట తీశారని సామెత. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలాగే ఉంది. ఆ పార్టీపై మోజు ఎక్కువ కాలం ఉండదు' అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నా సొంత నేతలను తయారు చేసుకోలేకపోయారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను దిగుమతి చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.