టిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ టిడిపి శాఖను టిఆర్ఎస్లో విలీనం చేయాలని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోయిందనే ప్రచారం కంటే ఇదే నయమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.
నా పెళ్ళి ముహుర్తం ఎన్టీఆర్ పెట్టారు, రేవంత్తో కాంగ్రెస్కు నష్టం, కెసిఆర్ మిత్రుడు: మోత్కుపల్లి
ఎన్టీఆర్ 22వ, వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం నాడు మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ 22వ, వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాకపోవడంపై మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తెలంగాణలో పార్టిని బలోపేతం చేసే విషయమై మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబునాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయమై మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
టిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేయాలి
తెలంగాణలో టిడిపి లేదు, అంతరించిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఈ రకమైన ప్రచారంతో పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది,. ఈ తరుణంలో ఈ అవమానాలను భరించే కంటే టిఆర్ఎస్లో టిడిపిని విలీనం చేస్తే ప్రయోజనం ఉంటుందని మాజీ మంత్రి , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సూచించారు.014 ఎన్నికల్లో సుమారు 22 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు వేసిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలంటే ఈ పనిచేయాలని మోత్కుపల్లి సూచించారు. టిఆర్ఎస్ మంత్రి వర్గంలో బాబు నాయకత్వంలో పనిచేసే నేతలే ఉన్నారని మోత్కుపల్లి సూచించారు.
పార్టీని బలోపేతం చేసే నేతలు లేరు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించే నేతలు ఎవరూ లేరని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. పార్టీని బతికించుకొనేందుకు నేతలు ముందుకు రావడం లేదని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రకమైన పరిస్థితుల కారణంగా తన లాంటి సీనియర్ నేతలంతా మానసిక సంఘర్షణకు గురౌతున్నట్టు నర్సింహులు చెప్పారు.
ఎన్టీఆర్ వర్ధంతికి బాబు రాకపోవడంపై మోత్కుపల్లి అసంతృప్తి
ఎన్టీఆర్ 22వ, వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాకపోవడం పట్ల మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్ని పనులున్నా ఎన్టీఆర్ వర్ధంతి రోజున నివాళులర్పించేందుకు బాబు వస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని నర్సింహులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో బాబు పర్యటించాలి
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు తెలంగాణలో పర్యటించాలని మోత్కుపల్లి సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు బాబు పర్యటిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బాబు ప్లాన్ చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో పర్యటించి క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉందని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు.
రెండు రాష్ట్రాల్లో సంతోషం
తెలంగాణ టిడిపి రాష్ట్ర శాఖను టిఆర్ఎస్ లో విలీనం చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు.రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉంటారని మోత్కుపల్లి చెప్పారు. తాను రాజకీయ దురుద్ధేశ్యంతో ఈ మాటలను చెప్పడం లేదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.