రేవంత్ ను టార్గెట్ చేసిన మోత్కుపల్లి : 'చంద్రబాబుతో ఏం చెప్పారు..'
హైదరాబాద్ : పార్టీని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన భేటి కాస్త నేతల మధ్య విబేధాలకు వేదికగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని ముందుండి నడిపించే విషయంలో అంతర్గత ఆధిపత్య పోరు నడుస్తుందనే విషయం తాజా టీటీడీపీ సమావేశంలో తేట తెల్లమైందంటున్నారు పలువురు.
తెలంగాణలో ఇప్పటికే చాలావరకు దెబ్బ తిన్న టీటీడీపీ ని తిరిగి ఫామ్ లోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్న నేపథ్యంలో.. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబుతో టీ-టీడీపీ నేతలు సోమవారం నాడు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి వైఖరితో ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరగ్గా.. అసలు ఎవరి నాయకత్వంలో పనిచేయాలంటూ..? ప్రశ్నించారట సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.
తెలంగాణలో పార్టీ పోకడలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, 'ఎవరికి వారే జిల్లా పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారని, కనీస సమాచారం అందించకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని' అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీని సమన్వయ పరిచే నాయకత్వమే లేదని చంద్రబాబుకు విన్నవించిన ఆయన, పార్టీ కార్యక్రమాల గురించి కూడా తమకు తెలియకపోవడం పార్టీలో లోపాలను ఎత్తి చూపిస్తోందన్న తరహాలో చెప్పుకొచ్చారట.
టీటీడీపీకి చంద్రబాబు డైరెక్షన్స్.. ముద్రగడతో ఎమ్మెల్యే ఆకుల భేటి
ఎవరికి నచ్చినట్టు వారు పార్టీ కార్యక్రమాలను రూపొందించుకుంటే వెళ్తే ఎలా..? అని ప్రశ్నించిన మోత్కుపల్లి, అసలు ఎవరి నాయకత్వంలో తాము పనిచేయాలని, ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే మోత్కుపల్లి చేసిన ఈ వ్యాఖ్యలన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసినట్టున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పార్టీకి సంబంధించిన కార్యాచరణ అంతా ఆయనే చూసుకుంటుండడం, దానిపై మోత్కుపల్లికి సమాచారం లేకపోవడం ఆయనలో అసంతృప్తిని రాజేసిందన్న చర్చ జరుగుతోంది.
కాగా, మోత్కుపల్లి ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు తెలియజేసేందుకు ఓ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారట. ఇదే విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలతో చెప్పిన చంద్రబాబు ఇక మీదట ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారట.