రామోజీని పిలవరా, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు: మోత్కుపల్లి సంచలనం, కంటతడి, అరెస్ట్
హైదరాబాద్: ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయని, అందులో తాము భాగస్వాములం కాదల్చుకోలేదని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
మాదిగలకు రిజర్వేషన్, మందకృష్ణ మాదిగ అరెస్ట్ తదితర అంశాలపై స్పందించారు. మాదిగలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ అణిచివేయాలని చూస్తే మాత్రం తిరగబడతామని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడటం లేదు
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రికేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని మోత్కుపల్లి నిలదీశారు. మందకృష్ణ మాదిగ అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణపై తాడోపేడే తోల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
ప్రభుత్వాన్నీ కూలదోసే ప్రయత్నాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యూడల్ మనస్తత్వాన్ని వీడాలని మోత్కుపల్లి అన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాము భాగస్వాములం కాదల్చుకోలేదని తేల్చి చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, పోలీసులతో రాజ్యం నడిపించలేరన్నారు.
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి గురువారం ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. అప్పుడు ఆయన మాట్లాడారు. ఓ సందర్భంలో మోత్కుపల్లి కంటతడి పెట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రామోజీ రావును పిలవరా
అంతకుముందు మోత్కుపల్లి ప్రపంచ తెలుగు మహాసభలపై స్పందించారు. గద్దర్, విమలక్క, వందేమాతరం శ్రీనివాస్ వంటి పేద కవులను అవమానించినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ను గుర్తు చేసుకోకపోవడం, తెలుగు అభివృద్ధికి పాటుపడుతున్న రామోజీ రావును ఆహ్వానించక పోవడం దారుణం అన్నారు.
భయంతో వచ్చారు
తెలుగు మహాసభలకు వచ్చిన నటీనటులు, కళాకారులు అందరూ భయపడుతూనే వచ్చారు తప్ప ప్రేమతో రాలేదని మోత్కుపల్లి అన్నారు. వీటిని తెలుగు మహాసభల్లా కాకుండా కేసీఆఱ్ తన పొగడ్తల సభల్లా నిర్వహించారని ఎద్దేవా చేశారు. పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలకు కాకుండా ఇలాంటి అనవసర కార్యక్రమాలపై ప్రజల డబ్బును వృథా చేయడం కేసీఆర్ మానుకోవాలన్నారు.
మోత్కుపల్లి అరెస్ట్
అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను రామ్గోపాల్ పేట పోలీస్ స్టేషన్ తరలించారు. మోత్కుపల్లికి టిడిపి నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మద్దతు తెలిపారు.