కదిలిన యంత్రాలు, యంత్రాంగం..! ఎన్నికలకు సర్వం సిద్దం..!!
హైదరాబాద్ : రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పల్లె బాట పట్టిన యంత్రాంగం..! ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తున్న ఈసీ..!!
రాష్ట్రంలో 2,97,08,599 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 34,604 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి 2.80 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు మూడు హెలికాప్టర్లను కూడా ఉపయోగించనున్నారు. అలాగే అటవీ ప్రాంతాల్లో విధుల్లోఉన్న సిబ్బందికి ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించడం కోసం ఎయిర్ అంబులెన్స్ లను అందుబాటులో పెడుతున్నారు.
7గంటల నుండి 5గంటలకు..! ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలంటున్న ఈసీ..!!
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది. రాష్ట్రంలో తొలి దశలోనే మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 185 మంది పోటీపడుతున్నారు. అత్యల్పంగా మెదక్ పార్లమెంటుకు 10 మంది పోటీచేస్తున్నారు.
నిజామాబాద్ లో టెన్షన్..! అందరి ద్రుష్టి అక్కడే..!!
మొత్తంగా 25 మంది మహిళలు పోటీలో ఉన్నారు. అత్యధికంగా మహబూబాబాద్లో నలుగురు మహిళలు పోటీచేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాలకు పోటీచేస్తుండగా.. ఎంఐఎం ఒక స్థానంలో, బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2చోట్ల బరిలో నిలుచున్నాయి. గుర్తింపుపొందిన ఈ పార్టీల నుంచి మొత్తం 61 మంది పోటీచేస్తుండగా.. రిజిస్టర్ అయిన పార్టీలవారు 83 మంది, స్వతంత్ర అభ్యర్థులు 299 మంది ఎన్నికల రంగంలో ఉన్నారు.
కేసీఆర్ కు ఈసీ నోటీసులు..! ఆ అనుచిత వ్యాఖ్యలే కారణం..!!
కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ హిందూ గాళ్లు బొండు గాళ్లు... దిక్కుమాలిన దరిద్రపు గాళ్లు, దేశంలో అగ్గి పెట్టాలే, గత్తర లేవాలే అంటూ ఈనెల 17న కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హిందువులకు వ్యతిరేకంగా ఘాటు గా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు పరిశీలించిన ఈసీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి 12వ తేదీ సాయంత్రంలోపు అనుచిత పదాలపై సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఒక కులం లేదా మతం, భాషాపర మైనార్టీలకు వ్యతిరేకంగా అనుచిత విమర్శలు చేయవద్దని ఆ నోటీసులో ఈసీ స్పష్టం చేసింది.