ఎన్నికలు, శేరిలింగంపల్లి టీడీపీలో వర్గపోరు: ఆనంద్ ప్రసాద్పై చెప్పులతో దాడి, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి (కోదండరాం పార్టీ), సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు ఆయా పార్టీలకు చాలా క్లిష్టంగా మారింది.
తెలంగాణలో ఆ స్థానంపై బాలకృష్ణ సూచన, చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారా?
కాంగ్రెస్ పార్టీలోనే ఒక్కో నియోజకవర్గానికి ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు కూటమి కారణంగా దాదాపు 25 నుంచి 30 సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందులు తీసుకు వచ్చింది. హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉంది.
శేరిలింగంపల్లి నుంచి బరిలో టీడీపీ
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అధికారికంగా కూటమి నుంచి టీడీపీకి పచ్చ జెండా రాలేదు. కానీ ఆ సీటు ఖాయంగా టీడీపీకి వచ్చే పరిస్థితి ఉంది. టిక్కెట్ కూడా ఆనంద్ ప్రసాద్కు దాదాపు ఖాయమైంది.
బాలకృష్ణ సిఫార్సుతో ఆనంద్ ప్రసాద్కు టిక్కెట్!
ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి నుంచి పోటీ కోసం ఆసక్తి చూపిస్తున్న భవ్య క్రియేషన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిక్కెట్ తనకే ఇస్తారని ధీమాగా ఉన్నారు. అంతేకాదు, ఆయన పేరును హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సిఫార్సు చేసినట్లుగా కూడా చేశారట.
మొవ్వ, ఆనంద్ వర్గీయుల మధ్య గొడవ
ఈ నేపథ్యంలో ఆనంద్ ప్రసాద్ ఆదివారం శేరిలింగంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఆనంద్ ప్రసాద్, ఆయన వర్గీయుల ప్రచారాన్ని, ర్యాలీనీ శేరిలింగంపల్లి టిక్కెట్ ఆశిస్తున్న మరో టీడీపీ నేత మొవ్వ సత్యనారాయణ, ఆయన వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆనంద్ ప్రసాద్పై చెప్పులతో దాడి, ట్రాఫిక్ జామ్
ప్రచారం సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మొవ్వ వర్గీయులు.. ఆనంద్ ప్రసాద్ పైన చెప్పులతో దాడి చేశారు. అంతేకాదు, ఆనంద్ ప్రసాద్ వర్గీయుల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువర్గాలను పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా డిమాండ్
మరోవైపు, శేరిలింగంపల్లి టిక్కెట్ కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఆశావహులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి ఆదివారం తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. వందలాది మంది అనుచరులతో వెళ్లి.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించవద్దని, కాంగ్రెస్కు ఉంచాలని డిమాండ్ చేశారు.