బీజేపీ ఎక్కడుందో నిజామాబాద్ కు రా చూపిస్తా...నడ్డాను విమర్శించే స్థాయా నీది..కేటీఆర్ పై ఎంపీ అరవింద్
బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. అసలు జేపీ నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జేపీ నడ్డా ఎవరో మీ అయ్యనడుగు అంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో కేసీఆర్ బీజేపీ పెద్దల కాళ్ళ మీద పడినప్పుడు ఆ కాళ్ళల్లో ఆయన కాళ్ళు కూడా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మీలా దేశద్రోహులు కాదని దేశం కోసం ప్రాణమిచ్చే వ్యక్తి అని కితాబిచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా రిప్లై ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్
ఇక బీజేపీ ఎక్కడుందో తెలియాలంటే మీ చెల్లి నడుగు అంటూ సెటైర్ వేశారు. నిజామాబాద్ వస్తే ప్రజలు బీజేపీ ఎక్కడుందో చూపిస్తారని, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కూడా ప్రజలు బిజెపి ఎక్కడుందో చూపిస్తారని వ్యాఖ్యానించారు ధర్మపురి అరవింద్. సిరిసిల్లలో కూడా కేటీఆర్ ను ఓడించి బిజెపి విజయకేతనం ఎగర వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే 15 కోట్ల పైగా మెంబర్షిప్ ఉన్న ఏకైక పార్టీ బిజెపి అని పేర్కొన్న ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఎవరికి తెలుసని అదొక తుపాసు రావుల సమితి అని ఎద్దేవా చేశారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను అనే స్థాయి కేటీఆర్ కు లేదని తేల్చి చెప్పారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ అబద్ధాలకు, దందాలకు అన్నిటికీ అడ్డా అన్న ఎంపీ అరవింద్
జేపీ నడ్డా అబద్దాల అడ్డా కాదు .. కేసీఆర్ ఫామ్ హౌస్ అబద్ధాలకు, దందాలకు అన్నిటికీ అడ్డా అని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.కేటీఆర్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అంత సీన్ లేదని టిఆర్ఎస్ కి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గులాబి మయం కావద్దని హితవు పలికారు.కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు మాట్లాడటం ఆపాలని మండిపడిన ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడే లేడని, ఉత్త మాటలు ఆపి ఉత్తమ్ కుమార్ గులాబీ కండువా కప్పుకుంటే మంచిదని అరవింద్ విమర్శించారు.
నిజామాబాద్ లో కవితను ఓడించినట్టు సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించే రోజులొస్తాయన్న ఎంపీ అరవింద్
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అవినీతిపై సిబిఐ విచారణ కోసం బిజెపి డిమాండ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పారు.ఏదైనా పాపం పండే రోజు త్వరలోనే వస్తుందని, జైలుకెళ్లి వాళ్ళు తప్పక వెళతారని , దేనికి తొందర పడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో కవిత ను ఓడించిన ప్రజలు , రానున్న రోజుల్లో సిరిసిల్లలో కేటీఆర్ ను కూడా ఓడిస్తారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధర్మపురి అరవింద్ అన్నారు. మొత్తానికి బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాక టిఆర్ఎస్, బిజెపి నేతల మధ్య పెద్ద వార్ సృష్టించిందని చెప్పాలి