కేసీఆర్ ప్రీ పోల్ వ్యూహం: ఎంపీ పదవికి గుత్తా రాజీనామా? టీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ!
నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను ఈ నెల 14న పార్లమెంట్ స్పీకర్ కు ఆయన అధికారికంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారా? త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? ఒక ఎంపితోపాటు మరో ఎమ్మెల్యే స్థానానికి టీఆర్ఎస్ ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుందా?
ఇక ముందు ఎంపీ గుత్తా రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ గా క్యాబినెట్ హోదాలో కొనసాగనున్నారా? టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ 'అవును' అనే సమాధానాలే వినవస్తున్నాయి.
‘గుత్తా' రాజీనామా?
నంద్యాల మాదిరిగానే తెలంగాణలోనూ ఉపఎన్నికల పోరు మొదలుకానుంది. నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామా లేఖను ఈ నెల 14న పార్లమెంట్ స్పీకర్ కు ఆయన అధికారికంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది.
ఇది కేసీఆర్ వ్యూహమా?
కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరారు. అయితే, ఎంపీ పదవికి ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గెలవడం ద్వారా తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకునే ఉద్దేశంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్ నేతల డిమాండ్...
గుత్తా రాజీనామాతో నల్గొండ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందుగానే తమ సత్తా చాటే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉందని సమాచారం. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా తన పదవికి రాజీనామా చేస్తుండడం గమనార్హం.
కేబినెట్ హోదాకు అడ్డు అనే...
ఇక రాష్ట్ర రైతు సమన్వయ కన్వీనర్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కేబినెట్ హోదాకు ప్రస్తుతం గుత్తాకు కాంగ్రెస్ ఎంపీ హోదా అడ్డు వస్తుంది. దీంతో గుత్తా కూడా రాజీనామాకు సిద్ధం అయ్యారు.
ఈ ఎన్నికలు ‘ప్రీ పోల్’...
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికను ప్రీ పోల్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ ఎంపీతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉప ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది.
వారిని దెబ్బ తీయాలనే...
ఎంపీ గుత్తా రాజీనామాతో కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. నల్గొండ ఎంపీ స్థానం పరిధిలో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి లాంటి హేమాహేమీలు ఉండడంతో వీరిని దెబ్బకొట్టవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
టీఆర్ఎస్ సత్తా చూపే యత్నం...
సాధారణ ఎన్నికలకు ముందు నల్గొండ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్ను నైతికంగా దెబ్బకొట్టాలనేది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలవడం ద్వారా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి తెలియజెప్పే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది.