కార్తీక మాసంలో బతుకమ్మ ఆడిన ఎంపీ కవిత, ఎందుకో తెలుసా?
జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేటలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఇప్పుడు ఎన్నికల సీజన్. నాయకులు ప్రచారంలో వివిధ రకాల అవతారాలు ఎత్తుతారు. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకంగా మిరపకాయ బజ్జీలు వేసుకొని తిన్నారు. ఇప్పుడు కవిత కార్తీక మాసంలో బతుకమ్మ ఆడారు.
బతుకమ్మ తెలంగాణ సంప్రదాయ పండుగ. కానీ దసరాకు ముందు బతుకమ్మ జరుపుకుంటారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కారణంగా ఆమె ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి ఆడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
జగిత్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో కవిత మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో జగిత్యాల అభ్యర్థి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ భోలా శంకరుడని, జగిత్యాల అభివృద్ధికి రూ.1200 కోట్ల నిధులు ఇచ్చారని కవిత చెప్పారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
జగిత్యాలకు ఏం చేశామంటున్నారని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఇదే చివరిసారి అని చెప్పారని, మళ్లీ ఇప్పుడు మరోసారి అవకాశం అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాసకు ఓటేసి మళ్లీ కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు.