గణేష్ గుప్తా కోసం ఎంపీ కవిత ఏం చేశారో తెలుసా? అందరూ అవాక్కయ్యారు!
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ లోకసభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కారును నడిపారు. ఎన్నికల ప్రచారం కోసమే లేక సరదాగానో ఆమె ఈ పని చేయలేదు. తమ పార్టీకి చెందిన అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ఆమె స్టీరింగ్ పైన కూర్చున్నారు. ఇది అక్కడి వారిని అందరినీ ఆకట్టుకుంది.
నిజామాబాద్ అర్బన్ తెరాస అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆమె గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారు తలుపు తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. దాంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
గణేషన్నా కారు ఎక్కమనిచెప్పగానే
కవిత కారు ఎక్కి, స్టార్ట్ చేసే వరకు ఆమె కారు నడుపుతున్న విషయం వారికి అర్థం కాలేదు. ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చొని, గణేషన్నా కారు ఎక్కు.. అని చెప్పగానే బిగాల గణేష్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. గణేష్ గుప్తా ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కవిత డ్రైవింగ్ చేశారు. ఆమె గేర్లు మార్చుకుంటూ కారు నడపడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ ఎంపీగా మరో నేత కోసం ఆమె డ్రైవింగ్ చేయడం అందరినీ ఆకర్షించింది.
ఫోటోల్లో బంధించారు
కవిత డ్రైవింగ్ చేస్తుంటే పలువురు తమ తమ కెమెరాలతో ఫోటోలు తీసుకున్నారు. మీడియా ప్రతినిధులు ప్రత్యేక వాహనంలో కవిత కారును అనుసరించారు. స్వయంగా కవిత.. గణేష్ గుప్తాను రిటర్నింగ్ అధికారి వద్దకు తీసుకెళ్లడం పట్ల తెరాస శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.
కూటమిది తాటాకు చప్పుడేనా..? గులాబీ పార్టీని సెంటిమెంటే మళ్లీ గెలిపిస్తుందా..!
మహాకూటమిపై కవిత ఆగ్రహం
ఇదిలా ఉండగా, మహాకూటమిపై ఎంపీ కవిత కారాలు, మిరియాలు నూరారు. మహాకూటమిలోని నాయకులకు నిర్ణయాధికారాలు లేవని, వారు వ్యక్తులుగా మాత్రమే ఉన్నారని బుధవారం అన్నారు. కూటమికి రెండు అధిష్ఠానాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో రూపొందించే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ జాతీయ నాయకులు అమరావతికి తీసుకు వెళ్తే, వాటిని అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇంకా గందరగోళంలో
త్వరలోనే నామినేషన్ గడువు ముగుస్తున్నా, ఇప్పటి వరకు అభ్యర్థులు ఎందరో తేలలేదన్నారు. వారు గందరగోళంలో ఉన్నారని చెప్పారు. ప్రతిదానికీ ఢిల్లీకి వెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిన వారిని గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని కవిత ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజలే అధిష్ఠానమని చెప్పారు. తమ పార్టీకి 75 శాతం ప్రజల మద్దతు ఉందన్నారు.