ఆంధ్రజ్యోతి చంద్రబాబు కరపత్రిక, అబద్దాల జ్యోతి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వ్యయం విషయంలో ఈసీ నోటీసులపై రాసిన ‘ఆంధ్రజ్యోతి' పై ఎంపీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రజ్యోతి అబద్ధాల జ్యోతి అని ఆంధ్రుల పత్రిక అని ఆమె ఆరోపించారు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు కరపత్రికగా మారిందని కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి మీడియా సమావేశాలకు ఆంధ్రజ్యోతి, ఏబీఎన ప్రతినిధులను బహిష్కరిస్తున్నామన్నట్లు చెప్పారు.
నిజామాబాద్కు 15 వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల్లో నిజామాబాద్ బైపాస్ రోడ్డు పనులు మొదలు పెడతామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ భ్రష్టుపట్టి పోయిందని ఆమె చెప్పారు.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం:
నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికల వ్యయంలో తప్పుడు లెక్కలు చూపించారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల కమిషన్కు చూపించి లెక్కల్లో ఏకంగా రూ.32.65 లక్షలు తేడా వచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీకి ఆమె తన అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం టీఆర్ఎస్ పార్టీ ఆమెకు రూ.60 లక్షలు గ్రాంటుగా ఇచ్చింది.
ఆ లెక్కను ఆమె యథాతథంగా పేర్కొన్నారు. సొంతంగా 25 వేలను ఖర్చు చేయడంతోపాటు పది లక్షలు అప్పుగా తీసుకున్న విషయాన్ని కూడా కవిత తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, ఎన్నికల్లో తనకు రూ.22.39 లక్షలు ఖర్చు అయ్యాయని ఆమె తన వ్యయ నివేదికలో పేర్కొన్నారు. అయితే, కవిత సమర్పించిన లెక్కలను జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన కలెక్టర్ తోసిపుచ్చారు.
ఆమె ఎన్నికల ఖర్చును ఎన్నికల వ్యయ పర్యవేక్షణ విభాగానికి చెందిన గణాంక బృందం రూ.53.97 లక్షలుగా షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లో నమోదు చేసిందని స్పష్టం చేశారు. రెండింటినీ పోల్చి చూస్తే.. 32,65,773 తేడా వచ్చిందని, కొన్ని ప్రత్యేక ఖర్చులను కవిత తన అఫిడవిట్లో పేర్కొనలేదంటూ వాటి వివరాలను కూడా సమర్పించారు.
బహిరంగ సభలకు జనాలను తరలించడానికి వాహనాలను వినియోగించారని, వాటికి సంబంధించిన లెక్కలు చూపలేదని; కోరుట్ల, జగిత్యాల, మోర్తాడ్, బోధన్, ఆర్మూరు, డిచ్పల్లిల్లో జరిగిన బహిరంగ సభల లెక్కలు నమోదు చేయలేదని తప్పుబట్టారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఇచ్చిన పెయిడ్ న్యూస్కు లెక్కలు చెప్పలేదని స్పష్టం చేశారు.
ప్రింట్ మీడియాలో వాణిజ్య ప్రకటనలు, పెయిడ్ న్యూస్కు సంబంధించి దాదాపు రూ.20 లక్షల వరకూ వ్యత్యాసం ఉందని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే, గత ఏడాది జూన్ 16న జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కవితకు నోటీసు ((Rc.No. 01/Exp. Moni,/2014)) జారీ చేశారు. దానిలోని కొన్నింటిని అంగీకరించిన కవిత.. మరికొన్నింటిని తోసిపుచ్చారు.