ఇవాంకా ట్రంప్-యాచకురాలు అంజలి: కన్నీటిగాథకు చలించిన కవిత
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ను హైదరాబాద్ రావొద్దంటూ తన ఆవేదనను చెప్పుకున్న యాచకురాలు అంజలికి తెలంగాణ జాగృతి చేయూతనందించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక దినపత్రికలో అంజలిపై వచ్చిన కథనం చదివి చలించిపోయారు.
వెంటనే స్పందించిన కవిత..
అంజలి కుటుంబానికి బాసటగా నిలుస్తామని తెలియజెప్పి ఆమెలో ఆత్మస్థైర్యం నింపేందుకు తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ను అంజలి యాచిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పంపారు కవిత. ఆమె దయనీయ పరిస్థితిని రాజీవ్ ఎంపీ కవితకు వివరించారు. వెంటనే స్పందించిన కవిత.. తక్షణ సాయంగా అంజలి ఇద్దరు కూతుళ్లు సిరి, కీర్తిల పేరిట రూ. 50 వేలు చొప్పున రూ. 1 లక్ష చెక్కును అందజేయమని సూచించారు. ఈ మేరకు రాజీవ్ సాగర్ అంజలికి చెక్కును అందజేశారు.
ఇవాంకా రాకతో యాచకుల తరలింపు..
త్వరలో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వస్తున్నారు. ఆమెతో పాటు విదేశీ ప్రముఖులు సైతం సదస్సులో పాల్గొనేందుకు వస్తుండటంతో హైదరాబాద్ను బెగ్గర్ ఫ్రీగా చేసేందుకు యాచకులను చర్లపల్లి, ఇతర ప్రదేశాల్లోని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తోంది ప్రభుత్వం. వారికి అక్కడ పునరావాసంతో పాటు ఉపాధిని చూపే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది.
ఇవాంకాను రావొద్దంటూ..
ఈ పరిణామం జీడిమెట్లలో ఉంటూ తన ఇద్దరు కుతుర్లను స్కూలుకు పంపి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు యాచిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అంజలికి పెనుభారంగా మారింది. పొలియోతో ఒక కాలు, చేయి చచ్చుపడినా.. తన పిల్లలు సిరి, కీర్తిలను చదివించడానికి యాచిస్తున్న అంజలిని జీహెచ్ఎంసీ నిర్ణయం దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ను హైదరాబాద్ రావొద్దంటూ అంజలి నిరసన తెలిపింది. ఈ మేరకు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
చలించిపోయిన కవిత..
ఈ నేపథ్యంలో మీడియా కథనాలకు చలించిపోయిన ఎంపీ కవిత.. అంజలికి తెలంగాణ జాగృతి ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఆమె ఇద్దరు కూతుళ్లకు రూ. 50 వేలు చొప్పున చెక్కును అందజేశామని, ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తామని తెలంగాణ జాగృతి నేత రాజీవ్ తెలిపారు. అలాగే అంజలి తన కాళ్లమీద తాను నిలబడేందుకు కిరాణా షాపును పెట్టిస్తామని, ఆమెకు అనువైన ప్రదేశంను ఎంపిక చేసుకుంటే ఆ ఏర్పాట్లు చేస్తామని రాజీవ్ సాగర్ వివరించారు.
కవిత ఆదేశాలతో..
ఎంపీ కవిత ఆదేశాల మేరకు తాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చామని, అంజలి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పోలియో వల్ల ఒక కాలు, ఒక చేయి చచ్చుబడి పోయిందని, భర్త తాగుడుకు బానిసై, ఇంటికి కూడా రావడం మానేశాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అంజలిపైనే కుటుంబ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెయింగ్ మిషన్తోనన్నా ఉపాధి పొందాలని ఆమె చేసిన ప్రయత్నం సఫలం కాలేదన్నారు. రైల్వే డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కూడా తన సిబ్బందితో అక్కడి వచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ కన్వీనర్ అనంతుల ప్రశాంత్,పుట్టి శ్రీనివాస్, దస్తగిరి, ఆనంద్, శామ్యూల్, గోపి తదితరులు పాల్గొన్నారు.