2019లో అసెంబ్లీకి కల్వకుంట్ల కవిత: వెనుక పెద్ద ప్లాన్
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ కవిత అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఉందని టిఆర్ఎస్లో ప్రచారం సాగుతోంది.
నిజామాబాద్: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ కవిత అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఉందని టిఆర్ఎస్లో ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ స్థానానికి బదులుగా అసెంబ్లీకి పోటీచేస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే పార్లమెంట్ కంటే అసెంబ్లీ స్థానం నుండి పోటీకి కవిత మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం టిఆర్ఎస్ వర్గాల్లో ఉంది.
2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసింది. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరుతోందని కొన్నాళ్ళ క్రితం ప్రచారం సాగింది.
అయితే కేంద్రంలోని బిజెపితో జతకట్టేదిలేదనే సంకేతాలను టిఆర్ఎస్ ఇచ్చింది. ఈ తరుణంలో బిజెపి ప్రభుత్వంలో టిఆర్ఎస్ చేరే అవకాశం మాత్రం ఇప్పట్లో కన్పించడం లేదు.
ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను పురస్కరించుకొని 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయనుంది. అయితే ఎన్నికల సమయంలో చోటుచేసుకొనే పరిణామాలను బట్టి పొత్తులపై నిర్ణయం ఉండే అవకాశం లేకపోలేదు.
2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్న కవిత
2019 ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి బదులుగా అసెంబ్లీకి పోటీచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత భావిస్తున్నారని సమాచారం.2019 నాటికి ఎంపీగా కవిత ఐదేళ్ళు పూర్తి చేసుకొంటారు. ఎంపీగా అనుభవం గడించారు. అయితే బిజెపితో పొత్తు ఉండనందున కేంద్ర కేబినెట్లో కవితకు స్థానం దక్కదు. ఈ కారణంగానే ఎంపీ స్థానం కంటే ఎమ్మెల్యే స్థానంపై కవిత ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. రాష్ట్ర పరిపాలనలో అనుభవం సాధించేందుకుగాను కవిత అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం ఉంది.
రాష్ట్ర రాజకీయాల్లో పట్టు పెంచుకొనేందుకు అవకాశం
2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయడం ద్వారా కవిత రాష్ట్ర రాజకీయాలపై పట్టు పెంచుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కెటిఆర్ తనదైన ముద్ర వేశారు. అయితే సోదరుడి సహయంతో కవిత కూడ రాష్ట్ర రాజకీయాలపై పట్టును సాధించే అవకాశం లేకపోలేదు. అయితే టిఆర్ఎస్లో మంత్రి హరీష్రావుకు క్షేత్రస్థాయి నుండి మద్దతు ఉంది. అదే సమయంలో కవిత కూడ క్షేత్రస్థాయిలో తన పాపులారిటీని పెంచుకోవడంతో పాటు పరిపాలనపై పట్టుపెంచుకొనేందుకు ఇదే సరైన అవకాశమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
తండ్రి అడుగు జాడల్లో కవిత
టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు కెసిఆర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. తండ్రి అడుగుజాడల్లోనే కూతురు కవిత నడుస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుండి లేదా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కవిత పోటీ చేసే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
జాగృతి ద్వారా క్షేత్ర స్థాయిలోకి కవిత
తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో కవిత తన వంతు పాత్ర పోషించారు. బతుకమ్మ సంబరాల్లో కూడ ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో కూడ తెలంగాణ జాగృతికి జిల్లా కమిటీలున్నాయి. జాగృతి ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే జాగృతి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలపై కూడ కవిత కేంద్రీకరించారు. ఇవన్నీ కూడ ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
హరీష్కు చెక్ పెట్టేనా?
టిఆర్ఎస్లో ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా హరీష్రావుకు పేరుంది. ఎన్నికల సమయంలో సంక్షోభ పరిస్థితులను అనుకూలంగా మార్చడంలో హరీష్ దిట్టగా వ్యవహరిస్తారనే పేరుంది. 2019 ఎన్నికల్లో కవిత అసెంబ్లీకి పోటీచేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే టిఆర్ఎస్లో కెటిఆర్కు తోడుగా కవిత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం పార్టీలో హరీష్కు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఇవన్నీ ప్రచారం మాత్రమేనని టిఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కెటిఆర్, హరీష్, కవితల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవనే అభిప్రాయాలు టిఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
నిజామాబాద్ ఎంపీ స్థానంపై బిజెపి గురి
2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానంపై బిజెపి టార్గెట్ పెట్టింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అయితే టిఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ బిజెపిలో చేరనున్నారు. అయితే అరవింద్ బిజెపిలో చేరడం టిఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే కవిత నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కాకుండా అసెంబ్లీకి పోటీచేస్తే నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమై కూడ ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
నిజామాబాద్ ఎంపీ స్థానంపై రామ్ మాధవ్ ఆసక్తి
ఉత్తర తెలంగాణపై బిజెపి కేంద్రీకరించింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఉత్తర తెలంగాణతో పాటు నిజామాబాద్ కేంద్రీకరించారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 2,25,333 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీకి 2,72,123 ఓట్లు లభించాయి. టిఆర్ఎస్ ఎంపీ కవితకు 4,27,307 ఓట్లు లభించాయి.