‘తెలంగాణ సాహిత్యం జూలు విదిల్చింది..’, ఆకట్టుకున్న ఎంపీ కవిత ప్రజెంటేషన్!
తెలుగు భాష ప్రాచీనత, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అంశాలపై ఎంపీ కవిత మంగళవారం రవీంద్ర భారతిలో తెలుగు ఎన్నారైల ఎదుట ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు.
హైదరాబాద్: తెలుగు భాష ప్రాచీనత, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అంశాలపై ఎంపీ కవిత ప్రజెంటేషన్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా మంగళవారం రవీంద్ర భారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 'తెలంగాణ సాహిత్యం మేల్కొని జూలు విదుల్చుకుంది. జూలు విదిల్చే సందర్భాన్ని సింహావలోకనంగా పేర్కొంటారు. అంటే.. సింహం మూడు అడుగులు ముందుకేసి మళ్లీ తిరిగి ఠీవిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇదేవిధంగా తెలంగాణ సాహిత్యం మేల్కొన్న సందర్భంలో.. మనందరం కూడా సింహావలోకనం చేసుకోవాలి..' అని అన్నారు.
అంతేకాదు, కవిత.. స్వయంగా రాసుకొచ్చిన కాగితాల్లోని వివరాల ఆధారంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. టైపు చేయడానికి సమయం లేకపోవడంతో ఇలా రాసుకొచ్చినట్లు తెలిపారు. 'నా భయంకరమైన చేతి రాతను కాసేపు భరించాలి..' అంటూ చమత్కరించి సభలో నవ్వులు పూయించారు.
క్రీ.పూ. 3 శతాబ్దం నుంచి ప్రారంభించి.. తెలుగు భాష ప్రాచీనతను సవివరంగా వివరించారు కవిత. నేటి నవీన యుగం వరకు ఉన్న తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా తెలిపారు. ప్రముఖ కవులు, చారిత్రక వివరాలకు సంబంధించిన అంశాలను అలవోకగా చెప్పి సాహితీ ప్రియుల ప్రశంసలు అందుకున్నారామె.
ఈ సందర్భంగా పలువురు ఎన్నారై ప్రముఖులను కవిత సన్మానించారు. ఈ కార్యక్రమానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనెడా, దుబాయ్ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకే, యూఎస్ ప్రతినిధులు సందడి చేశారు.