కేటీఆర్కు రాఖీ కట్టి హెల్మెట్ ఇచ్చిన కవిత, షర్మిలని మిస్సయ్యా: జగన్, రాఖీ కట్టకున్నా.. పవన్
హైదరాబాద్/అమరావతి: దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టారు. రక్షా బంధన్ సందర్భంగా రాజకీయ నాయకులు పలువురు ట్వీట్లు చేశారు. ఈ రోజున తాను తన సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని జగన్ ట్వీట్ చేశారు.
షర్మిలను మిస్ అవుతున్నా
జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. రాఖీ పండుగ నాడు ప్రజా సంకల్పయాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లు అందరికీ జగన్ ట్వీట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.'షర్మిల.. రాఖీ పండుగ సందర్భంగా నిన్ను మిస్ అవుతున్నా. అన్నగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయ్. తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెళ్లందరికీ మీ జగనన్న రక్షా బంధన్ శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.
జగన్కు రాఖీ కట్టిన రోజా
విశాఖపట్నంలో జగన్ను వైసీపీ మహిళా నేత రోజా కలిశారు. ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. మహిళల సంక్షేమంపై దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో శ్రద్ధను కనబరిచేవారని, ఆ తర్వాత జగన్ మాత్రమే ఆ పని చేయగల నేత అన్నారు. పలువురు మహిళలు జగన్కు రాఖీ కట్టారు.
జగన్ సీఎం అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందని, జగనన్నకు రాఖీ కట్టడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, జగన్ ప్రకటించిన నవరత్నాలతో మహిళా లోకానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. జగనన్న తనకు ఆది నుంచి ఎంతో అండగా ఉన్నారని, ఎమ్మెల్యే కావాలన్న తన చిరకాల కోరికను ఆయన నెరవేర్చారని గుర్తు చేసుకున్నారు. కాగా, జగన్ కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు.
అన్నకు హెల్మెట్ కానుకగా ఇచ్చిన కవిత
తన అన్న, మంత్రి కేటీఆర్కు ఎంపీ కవిత రాఖీ కట్టారు. ఆనంతరం అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు హెల్మెట్ బహూకరించారు కవిత. సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం ద్వారా ప్రతి సోదరి తన సోదరులకు హెల్మెట్ కానుకగా ఇవ్వాలని కవిత ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ను ఇవ్వడం ద్వారా సోదరుల ప్రాణాలను కాపాడే విషయంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు.
రాఖీ కట్టినా, కట్టకపోయినా.. పవన్ కళ్యాణ్
రాఖీ కట్టినా కట్టకపోయినా. ప్రతి ఆడబిడ్డనీ మన ఇంటి బిడ్డగానే గౌరవించుకుందామని, అక్కాచెల్లెళ్ల గౌరవమర్యాదలు కాపాడి వాళ్ల ఉజ్వల భవితకు చేయూత ఇద్దామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోదర ప్రేమకు ప్రతిరూపంగా, మానవ సంబంధాలను పరిపుష్టం చేసేలా రాఖీ వేడుకలను చేసుకోవాలన్నారు. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ఈ పండగ ప్రతీకలా నిలుస్తుందన్నారు.