ఆ టోపీ ఎందుకు: ఎస్పీపై కవితకు కోపమొచ్చింది, కెసిఆర్కు పరిపూర్ణానంద ప్రశంస
వరంగల్: ఓరుగల్లు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఆగ్రహం వచ్చింది. వరంగల్ ఎస్పీ కిషోర్ ఝా పైన ఆమె శనివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా మంగపేట పుష్కర ఘాట్ వద్ద ఈ సంఘటన జరిగింది. కవితకు రక్షణగా ఉన్న పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ తన చుట్టూ అధిక సంఖ్యలో ప్రజలు పుష్కరాల కోసం వచ్చారు. దీంతో కవిత ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఎస్పీ పైన అసనహం వ్యక్తం చేశారు. నీ మాట ఇక్కడ ఎవరూ లెక్క చేయనప్పుడు నీకు ఆ టోపీ ఎందుకని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పుష్కరాలు విజయవంతమయ్యాయని చెప్పారు.
రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
టిఆర్ఎస్ పార్టీలో డిమాండ్ చేస్తే పదవులు రావని, సిఎం కెసిఆర్ తలచుకుంటేనే వస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హన్మకొండలోని తన స్వగృహంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
తనకు అండగా నిలిచిన దళిత సంఘాలకు కృతజ్ఞతలు చెప్పారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు తాను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నానని అన్నారు. కెసిఆర్ తల్చుకుంటే పదవులు వస్తాయని, డిమాండ్ చేస్తే రావని, తాను కెసిఆర్ ఆదేశాలు శిరసావహిస్తానన్నారు.
కెసిఆర్ పైన పరిపూర్ణానంద స్వామి ప్రశంస
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి కితాబిచ్చారు. ధర్మపురిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
హిందూ ధర్మాన్ని అనుసరిస్తే ప్రతి వ్యక్తికి మనుగడ ఉంటుందన్నారు. ధర్మపురి ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా పరిఢవిల్లాలన్నారు. ధర్మపురి పేరు ప్రపంచ చిత్రపటంపై మార్మోగిపోతోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ అపర చాణక్యుడిలా ముందుకెళ్తున్నారన్నారు.