డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్కు కవిత
Recommended Video
నిజామాబాద్: టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన మూడు రోజులుగా ఢిల్లీ ఉండి, కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడేందుకు ఢిల్లీకి వెళ్లి పెద్దలతో చర్చలు జరుపుతున్నందున ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు వారు సీఎం కేసీఆర్కు లేఖ కూడా రాశారు. బుధవారం నాడు కవిత క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా తెరాస నేతలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దాదాపు జిల్లా నాయకత్వం మొత్తం డీఎస్కు వ్యతిరేకంగా ఒక్కటైంది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కవిత, తెరాస నాయకులు.. డీఎస్ తీరుపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్లోకి డీఎస్?: ఢిల్లీలో కదలికలపై టీఆర్ఎస్ కన్ను, కేసీఆర్ వేటు వేసే ఛాన్స్
అవకాశవాదం కోసం కొడుకును బీజేపీలో చేర్చారు
డీ శ్రీనివాస్ వల్ల పార్టీకి జిల్లాలో కొంచెం కూడా మేలు జరగలేదని తెరాస నాయకులు మండిపడ్డారు. తెరాసలో కొనసాగుతూ వచ్చిన అతను అవకాశవాదం కోసం తన కొడుకును బీజేపీలో చేర్చారని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. ఈ మేరకు కేసీఆర్కు నిజామాబాద్ జిల్లా నేతలంతా లేఖ రాశారు.
డీఎస్ నిజస్వరూపం బయటపెట్టారు
డీఎస్కు గ్రూపులు కట్టే అలవాటు ఉందని కూడా లేఖలో టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారని తెలుస్తోంది. పైరవీలు, అక్రమార్జనకు అలవాటుపడిన డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నారని చెప్పారు. పార్టీలో తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో డీఎస్ కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. డీఎస్ తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ పార్టీ ద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కొడుకు కోసం డీఎస్ అవకాశవాదం
టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వచ్చిన అవకాశవాదంతో కొడుకును బీజేపీలో చేర్పించారని టీఆర్ఎస్ నాయకులు.. డీఎస్ పైన మండిపడ్డారు. కొడుకు ఎదుగుదల కోసం బీజేపీ పెద్దల వద్ద మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. డీఎస్ తన కొడుకు ఎదుగుదల కోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
డీఎస్పై కవిత నిప్పులు
డీ శ్రీనివాస్ పైన ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల పార్టీకి జరిగిన ఉపయోగం ఏమీ లేదని, ఆయన ఉన్నా లేకున్నా ఒకటే అన్నారు. వెంటనే డీఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జిల్లా కమిటీ తీర్మానించిందని, ఈ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్కు ఇప్పటికే పంపించామన్నారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేశామన్నారు. ఆయన వల్ల పార్టీకి కొంచెం కూడా ప్రయోజనం లేదన్నారు. ఆయన పనులతో పార్టీకి నష్టం వాటిల్లిందని, తన ఉనికిని చాటుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తెరాసకు నష్టం కలిగిందన్నారు.
రేపు నేను తప్పు చేసినా నాపై చర్యలు
పార్టీలో వర్గాలను పెంచి పోషించారని, మిగతా నేతలంతా ఏకతాటిపై ఉంటే, ఈయనొక్కరే మరో దారిలో వెళుతున్నారని కవిత ఆరోపించారు. కేవలం ఓ కుటుంబం కోసం పార్టీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. డీఎస్ వ్యవహారంపై చాలా రోజులుగా ఓపిక పట్టామన్నారు. కార్యకర్తలను ఇతర పార్టీలలోకి వెళ్లాలని డీఎస్ సూచించారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించనని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. రేపు నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు. మా ఆవేదన తెలియజేసేందుకే అందరం కలిసి లేఖ రాశామన్నారు.