హైదరాబాద్-వరంగల్ రహదారిపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన.. అరెస్ట్
హైదరాబాద్ : స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అలస్వం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా చేపట్టారు. ప్రజా ప్రతినిధుల ఆందోళనతో రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు .. కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులతో కలిసి వరంగల్ హైదరాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. నేతల ఆందోళనతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. దీంతో ఓ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్తత మధ్యే పోలీసులు కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
గత ఐదేళ్ల నుంచి స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని కేసీఆర్పై మండిపడ్డారు కోమటిరెడ్డి. స్థానిక సంస్థల నిధులు విధులు కోసం భువనగిరి నుంచి పోరాటం ప్రారంభించామని చెప్పారు. దీనిని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు తెలుపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను సీఎం కేసీఆర్ కేటాయించడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్కు చెక్ పవర్ కల్పించి .. సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య గొడవ పెట్టారని విమర్శించారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యం జరిగితే సర్పంచ్ మీద వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.