ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత, కారులోనే కుప్పకూలారు, కేసీఆర్ ఆదేశాలు..
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ స్టాండిగ్ కమిటీ సమావేశానికి కులు వెళ్లారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ స్టాండిగ్ కమిటీ సమావేశానికి కులు వెళ్లారు.
ఆయనకు అక్కడ గుండెపోటు రావడంతో కారులో వెనుక సీటులోనే కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పాల్వాయి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పాల్వాయికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు.
1967లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి భవనం వెంకట్రామ్, విజయ భాస్కర్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో, అభివృద్ధిలో పాల్వాయి కీలక పాత్ర పోషించారు.
పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. పాల్వాయి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పాల్వాయితో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ మాట్లాడి... వివరాలు అడిగి తెలుసుకున్నారు. కులులో చనిపోయిన పాల్వాయి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ను సీఎం ఆదేశించారు.
మృతదేహం తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డిని సీఎం కోరారు.