కేసీఆర్! వీఐపీ ప్రాణాలకే విలువెక్కువా? కేంద్ర బృందంపైనా సర్కారు ఒత్తిడా?: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారు విధానాలపై మండిపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు.రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
వీఐపీల ప్రాణాలకే విలువెక్కువా?
తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెడుతోందని విమర్శించారు. నామమాత్రపు కరోనా పరీక్షలతోనే రాష్ట్రంలో 32.1 శాతం పాజటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ.. పేద, మధ్యతరగతికి ఇవ్వడం లేదని రేవంత్ విమర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల కంటే శ్మశానాలే నయం..
కరోనా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం కంటే శ్మశానానికి వెళ్లడం మేలని ప్రజలు అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
సీతక్కను ఎగతాళి చేసి.. పారాసిటమాల్ అంటూ..
మొదట్లో ఈ విషయంపై ఎమ్మెల్యే సీతక్క మంచి సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళిచేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పారాసిటమాల్ మందు బిళ్ల వేసుకుంటే చాలని తేలిగ్గా తీసుకున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందని మంత్రులు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని ఈ కాంగ్రెస్ ఎంపీ విమర్శించారు.
కేంద్ర బృందంపై కేసీఆర్ ఒత్తిడి.. అందుకే..
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం కరోనా విషయంలో తొలి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉందని విమర్శించారు. కాగా, తెలంగాణలో రోజురోజుకుకరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9000 యాక్టివ్ కేసులున్నాయి. 5172 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 247 మంది కరోనాతో మరణించారు.