కేసీఆర్ సర్కార్పై కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి పోరు: రేవంత్ లేఖ: మోడీ, అమిత్షాలకు: బండి సంజయ్
హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదం కేంద్రబిందువుగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ జలదోపిడీకి కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటూ ఆరోపణలను గుప్పించారు. అక్కడితో ఆగలేదాయన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్లకు లేఖ రాశారు.
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్నఅగ్నిప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ రేవంత్ రెడ్డి ప్రధానికి విజ్ఙప్తి చేశారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పేర్కొన్నారు. కుట్ర కోణం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం సహజంగా సంభవించలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఫలితంగా- తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలను కోల్పోయారని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు మృతుల కుటుంబీకులకు కూడా సంతృప్తిని కలిగించలేదని, వారు జెన్కో కార్యాలయం ముందు ధర్నా చేశారని పేర్కొన్నారు.
నాసిరకం నిర్వహణ
శ్రీశైలం రిజర్వాయర్ నిర్వహణ పనులపైనా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో నిర్వహించిన రిజర్వాయర్ల భద్రతపై ఏర్పాటుచేసిన జాతీయకమిటీ 39వ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ స్ట్రక్చర్స్, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, నిర్వహణపై నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. అయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం.. ఈ దిశగా సరైన చర్యలను చేపట్టడంలో విఫలమైందని అన్నారు. ఫలితంగా ఈ అగ్నిప్రమాదం సంభవించిందని ఫిర్యాదు చేశారు.
ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ఎందుకు?
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీలు కల్పించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ నాయకులు బాధితులను పరామర్శించడానికి వెళ్లగా.. పోలీసులను అడ్డుగా పెట్టుకుని, తమను నిర్బంధించారని పేర్కొన్నారు. పోలీసులను ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రైవేటు బలగాలుగా మార్చివేసిందని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దమననీతిపై గళం ఎత్తిన వారిని ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేస్తోందని విమర్శించారు.
సీబీఐ విచారణ.. కోటి రూపాయల పరిహారం..
ఇలాంటి పరిణామాల మధ్య బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై వెనుక గల అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరారు. ఇదే తరహా లేఖలను అమిత్ షా, గజేంద్ర సింగ్ షెఖావత్లకూ పంపించారు రేవంత్ రెడ్డి.
బండి సంజయ్ డిమాండ్కు
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం అగ్నిప్రమాదంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ డిమాండ్ చేసిన రెండు రోజుల్లోనే అదే కోణంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని, కేంద్రమంత్రులకు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఐడీ విచారణ పట్ల తమకు నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ బండి సంజయ్ ఇదివరకు డిమాండ్ చేశారు.