91 ఏళ్ల వయసులో ఆ వృద్దుడికి ఎంత ఓపిక... ఎంపీ సంతోష్ కుమార్ ఫిదా...
ఆ వృద్దుడి వయసు 91 ఏళ్లు... సాధారణంగా ఈ వయసులో సొంత పనులు చేసుకోవడమే చాలామందికి కష్టంగా ఉంటుంది. కానీ హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన ఓ వృద్దుడు పర్యావరణహితం కోసం ప్రతీ రోజూ వేకువ జామునే నిద్రలేచి... రహదారి డివైడర్పై ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా తనంతట తానే ఈ పనికి పూనుకున్నాడు. కొన్ని నెలలుగా ఇది తన దినచర్యగా మలుచుకున్నాడు. నితిన్ సంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి ఆ వృద్దుడి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు,పర్యావరణ ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ వీడియోని చూసి మురిసిపోయారు. ఇంత వృద్దాప్యంలోనూ ఆ పెద్దాయన చేస్తున్న పనికి ఫిదా అయ్యారు. 'ఈ పెద్దాయనను పొగిడేందుకు మాటలు కూడా రావట్లేదు. నేను మీకు తలవంచి నమస్కరిస్తున్నాను సార్... ప్రకృతి పట్ల మీకు ప్రేమ ఉంటే... దానికోసం ఏదైనా చేసేందుకు మిమ్మల్ని ఏదీ ఆపలేదు. మీకు మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నాను.' అని ఎంపీ సంతోష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా,ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో పర్యావరణ ఉద్యమాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఇప్పటివరకూ ఎంతోమంది మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని గతేడాది దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు.
No words to hail this elderly person. I bow before you sir. If you have affection towards Nature and determination to do something good, nothing can stop you.
— Santosh Kumar J (@MPsantoshtrs) October 21, 2020
More power to you sir. Thank you @nitinsangwan ji for bringing the noble act to see the light.🙏#SALUTE https://t.co/pBAfeE4SWd