మెట్రో రైడ్లో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ మంత్రి కేటీఆర్
ప్రజాప్రతినిధులు నిర్వహించిన మెట్రో రైలు ప్రయాణం అంతా సరదాగా సాగింది. మంత్రి కేటీఆర్ చలోక్తులతో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు. ప్రయాణ టిక్కెట్ల ధర నుంచి ఎంపీల వేతనాలు.. అక్రమ కట్టడాలు..
హైదరాబాద్: మంగళవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భాగ్య నగర ప్రజలకు అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విశేషాలు ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు శనివారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్రయల్ రన్ లో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ప్రయాణించారు.
ఈ ప్రయాణం రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా హాస్యరసాన్ని పండించింది! ప్లాట్ఫాం వద్దకు చేరింది మొదలు.. నాగోల్లో మెట్రో రైలెక్కి మెట్టుగూడ స్టేషన్ వరకు పరస్పరం చెణుకులు, నవ్వులతో సరదాగా సాగింది. వీరిలో మంత్రి కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు.
మల్లారెడ్డికి రూ. లక్ష.. జితేందర్ కు రూ.50 వేలు అని కేటీఆర్ చమత్కారం
ఢిల్లీ మెట్రో రైలు కంటే తక్కువ టికెట్ ధర ఉండాలని అన్న ఎంపీ మల్లారెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్.. ‘ఎంపీలకు ఎక్కువ రేట్లు పెడుతున్నం. మల్లారెడ్డికైతే రూ.లక్ష, మీకైతే రూ.50 వేలు అంటూ ఎంపీ జితేందర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అంటే.. మా జీతంలో సగం టికెట్ ధరకే సరిపోతోంది అని జితేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మళ్లీ స్పందిస్తూ.. ‘‘ఐటీ రిటర్న్స్ చూసి టికెట్ ఫిక్స్ చేస్తం'' అనడంతో అక్కడంతా నవ్వులే నవ్వులు!! మంత్రులు, పద్మారావు, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, జితేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైలులో ప్రయాణించారు.
మహిళ భర్తలు, పిల్లలపై మంత్రి కేటీఆర్ ఇలా చమత్కారం
రైల్లో నేతలంతా రెండు వైపుల ఉన్న సీట్లలో కూర్చున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే ప్రభాకర్, మంత్రులు పద్మారావు, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి.. ఎంపీ జితేందర్ రెడ్డి కూర్చున్నారు. మరోవైపు ఎమ్మెల్యే వివేక్, ఎంపీలు మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి కూర్చున్నారు. కేటీఆర్, పద్మాదేవేందర్ రెడ్డి నిల్చున్నారు. మీడియా సభ్యులతో బోగీ కిక్కిరిసిపోవడంతో.. ఫొటోలను ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ ప్రతినిధులకు సూచించారు. పద్మక్కా.. ఏమిటి? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. ‘‘మహిళల కోసం ప్రత్యేక బోగీ ఉండాలె'' అని కేటీఆర్ను ఉద్దేశించి ఆమె అన్నారు. స్పందించిన కేటీఆర్ ‘మహిళలకు వేరే బోగీ వేస్తే, వారి భర్తలు, పిల్లల సంగతేమిటి మరి' అనడంతో అంతా నవ్వేశారు.
పార్కింగ్ పక్కాగా ఉండాలన్న మంత్రి కేటీఆర్
కేటీఆర్ మళ్లీ స్పందిస్తూ అద్దంలో నుంచి కనిపిస్తున్న పెద్ద పెద్ద భవనాలు, మధ్యలో ఖాళీ భూముల్ని చూస్తూ ‘డీవియేషన్ ఉన్న నిర్మాణాల్ని గుర్తించేందుకు మెట్రో రైల్లో ప్రయాణిస్తే సరిపోతుందేమో' అని అన్నారు. తర్వాత ‘‘పట్నంలో ఇక నుంచి నన్ను ఎవరైనా ఆహ్వానిస్తే జూబ్లీహిల్స్లో రైలు ఎక్కుతా. గమ్యస్థానం దగ్గర వెహికిల్ను సిద్ధంగా ఉంచాలె'' అని వ్యాఖ్యానించారు. స్పందించిన మంత్రి మహేందర్ రెడ్డి ‘‘మేం మెట్రో రైళ్లను అనుసంధానం చేసేందుకు పెద్ద ఎత్తున బస్సుల్ని సిద్ధం చేశాం'' అని అన్నారు. అద్దంలోంచి ఓ చోట ఖాళీగా స్థలం కనిపించడంతో.. ‘‘ఇదేం ల్యాండ్ పార్కింగ్కు సరిపోతుందేమో కదా?'' అని కేటీఆర్ అన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి జోక్యం చేసుకొని.. ఆ ల్యాండ్ వివాదంలో ఉందన్నారు. దీనికి కేటీఆర్.. ‘పార్కింగ్ ఏర్పాట్ల సంగతి చూడాల్సిందే' అన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్తో మంత్రి కేటీఆర్ ఇలా
మెట్రో రైడ్ కోసం నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ ఫ్లాట్ఫాం మీదకు వచ్చినప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్తోపాటు పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ను కేటీఆర్ విష్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్.. ‘‘చూశారా అందరం ఒకే ప్లాట్ఫాం మీదకు చేరాం'' అని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీలకతీతంగా నేతలమంతా ఒకచోటకు చేరామన్న ఆయన శ్లేషకు కేటీఆర్ నవ్వులు చిందించారు.