ప్రపంచ ‘ప్రత్యేక’ విందుకు ‘ఫలక్నుమా’ రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాక
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు నగరం సర్వం సిద్ధమైంది. కాగా, ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులు, ప్రతినిధులకు ఫలక్నుమా ప్యాలెస్లో పసందైన విందు ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి.
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు నగరం సర్వం సిద్ధమైంది. కాగా, ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులు, ప్రతినిధులకు ఫలక్నుమా ప్యాలెస్లో పసందైన విందు ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి.
వేదికపై మోడీ-ఇవాంకా-కేసీఆర్ మాత్రమే: భద్రత కట్టుదిట్టం
యాడంగ వస్తందో.. యానంగ పోతదో: హోంమంత్రి నాయిని, ఇవాంకా టూర్ షెడ్యూల్లో మార్పు!?
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో...
ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28వ తేదీ రాత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున ఫలక్నుమా ప్యాలెస్లో ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈ విందు ఇస్తున్నారు. భారతదేశ సంప్రదాయ రుచులు, దేశ, విదేశీ ఆహార పదార్థాలను అతిథులకు అందించనున్నారు.
Recommended Video
మోడీ, ఇవాంకాలతోపాటు దిగ్గజాలు
ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్, దేశ విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు సహా రెండు వేలమంది విందులో పాల్గొంటారు. 101 గదిలో ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఇవాంకా ట్రంప్, ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, కుమారమంగళం బిర్లా, విదేశీ ప్రతినిధులు ఉంటారు. మిగతావారికి పచ్చికబయలులో ఏర్పాట్లుంటాయి.
అన్ని ఏర్పాట్లు
ప్రతినిధులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు అమెరికా భద్రతా విభాగ అధికారులు, ప్రత్యేక భద్రతాదళం (ఎస్పీజీ), నీతి ఆయోగ్, పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ ఐజీ, నీతి ఆయోగ్ ప్రతినిధి విక్రమ్సింగ్గౌర్లు ఫలక్నుమా ప్యాలెస్కు మంగళవారం వచ్చారు. అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రమోద్ కుమార్, వి.సత్యనారాయణ, ఎ.వి.రంగనాథ్లలో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
గుర్రపు బగ్గీలు, బ్యాటరీ వ్యాన్లు సిద్ధం..
ప్యాలెస్లోకి వీవీఐపీలు మినహా మరెవరికీ అనుమతి లేదు. కిలోమీటరు దూరంలోనే అతిథుల వాహనాలను నిలిపివేస్తారు. అక్కడి నుంచి వారిని బ్యాటరీవ్యాన్లు, గుర్రపు బగ్గీల్లో విందు వేదిక వద్దకు తీసుకొస్తారు. ఆ సమయంలో మార్గమంతటా ఇరువైపులా పోలీసుల రక్షణ ఉంటుంది.
ప్రత్యేక బృందాల పర్యవేక్షణ
2వేల మందిని తీసుకెళ్లేందుకు వీలుగా ప్యాలెస్లో ఉన్నవాటికి అదనంగా 15 బ్యాటరీ వ్యాన్లను తెప్పించనున్నారు. సరదాపడే విదేశీ అతిథులను గుర్రపుబగ్గీల్లో తీసుకెళ్తారు. మోడీ, ఇవాంకాల రాకపోకలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ప్యాలెస్కు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అమెరికా, భారత అధికారులు కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.