ఎందుకిలా?: తానొకటి తలిస్తే... విక్రమ్ ధైర్యవంతుడే, కానీ
రాజకీయాలకు దూరంగా పెద్ద కొడుకు విక్రమ్గౌడ్ను ఉంచాలని మాజీ మంత్రి ముఖేష్గౌడ్ భావించారు. కానీ, రాజకీయాలపై ఆసక్తితో విక్రమ్గౌడ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు.
హైదరాబాద్: రాజకీయాలకు దూరంగా పెద్ద కొడుకు విక్రమ్గౌడ్ను ఉంచాలని మాజీ మంత్రి ముఖేష్గౌడ్ భావించారు. కానీ, రాజకీయాలపై ఆసక్తితో విక్రమ్గౌడ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖేష్గౌడ్ మంత్రిగా ఎన్నికైన సమయంలో నియోజకవర్గంలో పార్టీ వ్యవహరాలను విక్రమ్గౌడ్ చూసుకొనేవారు. అయితే తండ్రి వద్దనుకొన్నా విక్రమ్గౌడ్ అనుహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతారు. విక్రమ్గౌడ్పై కాల్పుల ఘటనతో ముఖేష్గౌడ్ తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబతుున్నారు.
జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ముఖేష్గౌడ్ కీలకంగా వ్యవహరించేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. అయితే తనకు ఉన్న ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు విక్రమ్గౌడ్ అంటే ముఖేష్ రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించాడు.
విక్రమ్గౌడ్పై కాల్పులు: ఆ తుపాకీ ఎక్కడ, విక్రమ్కు నిజనిర్ధారణ పరీక్షలు?
కానీ, ఆచరణలో అది మాత్రం సాధ్యంకాలేదు. రాజకీయ కుటుంబం కావడంతో విక్రమ్గౌడ్ అనివార్యంగా రాజకీయాల్లో అనివార్యంగా దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాలపై ఆసక్తితోనే ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
రాజకీయాల్లో స్వతహగా ఎదగాలని విక్రమ్గౌడ్ ప్రయత్నాలు చేశారు. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూనే స్వతహగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎదిగే ప్రయత్నం చేశారు.
ముఖేష్ అలా....విక్రమ్ ఇలా
విక్రమ్గౌడ్ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ముఖేష్గౌడ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయాన్ని విక్రమ్తో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయాల్లోకి వస్తానని తన అభిలాషను విక్రమ్ గతంలోనే కుటుంబసభ్యులకు చెప్పేశాడు. అయితే ముఖేష్గౌడ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో విక్రమ్గౌడ్ రాజకీయాల్లో దూసుకువెళ్ళే అవకాశం లభించింది. తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై కేంద్రీకరించారు.
మేయర్ అభ్యర్థిగా బరిలోకి
జిహెచ్ఎంసి మేయర్గా కాంగ్రెస్ పార్టీ తరపున విక్రమ్గౌడ్ బరిలోకి దిగారు. అయితే ఆయన కార్పోరేటర్గా ఓటమిపాలయ్యారు. కార్పోరేటర్గా ఆయన పోటీచేసిన స్థానంలో సుమారు కోటిరూపాయాలను ఖర్చుచేసినట్టు ప్రచారంలో ఉంది. అయితే ఈ డివిజన్ నుండి ఆయన ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ సమయం నుండి ఆయన సమస్యల్లో కూరుకుపోయారని అంటున్నారు.
వ్యాపారంలో నిలదొక్కుకోలేదు
వ్యాపారంలో విక్రమ్గౌడ్ నిలదొక్కుకోలేదు. రెండేళ్ళ క్రితమే తండ్రికి దూరంగా వేరు కాపురం పెట్టాడు. నష్టాలతో అప్పులబారిన పడ్డారు. మైనింగ్, సినిమా, స్టూడియో రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అయితే ఈ వ్యాపారాల్లో పెద్దగా రాణించలేదు. పైగా నష్టాల బారినపడ్డాడు. వ్యాపారాల్లో నష్టపోయిన విషయాన్ని విక్రమ్గౌడ్ తండ్రికి చెప్పారని, అదే సమయంలో ఆయనపై కాల్పులు జరగడంతో మాజీ మంత్రి ముఖేష్గౌడ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు ఆయన సన్నిహితులు చెబతున్నారు.
మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ముఖేష్
విక్రమ్గౌడ్పై కాల్పులు జరిగిన ఘటన విషయం తెలిసిన గంటలోపుగానే ముఖేష్గౌడ్ ఆపోలో ఆసుపత్రికి చేరుకొన్నారు. మూడు రోజులుగా ఆయన ఆపోలో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. విక్రమ్గౌడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే చాలని ఆ కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాల్పుల విషయం తెలిసి ముఖేష్గౌడ్ను పరామర్శించేందుకు ప్రయత్నించినా వారికి కూడ ముఖేష్గౌడ్ అందుబాటులో ఉండడం లేదు.
విక్రమ్ ధైర్యవంతుడు
విక్రమ్గౌడ్ ముందు ఎవరైనా గట్టిగా మాట్లాడాలంటేనే భయపడతారని, అలాంటి వ్యక్తిపై కాల్పులు జరిపే ధైర్యం ఎవరికి ఉంటుందనే విషయమే అర్ధం కాకుండా ఉందని ఆయన గురించి తెలిసిన వారంటున్నారు. విక్రమ్ చాలా దూకుడు స్వభావం కలవాడని కూడ వారు గుర్తుచేస్తున్నారు.మరోవైపు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కూడ కాదనే అభిప్రాయాలను కూడ వారు వ్యక్తం చేస్తున్నారు.
సెల్ఫోన్ విశ్లేషణ
విక్రమ్గౌడ్ సెల్ఫోన్ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆయన సెల్ఫోన్లో ఉన్న సమాచారాన్ని, ఆయన కాల్డేటాపై పోలీసులు ఆరాతీస్తున్నారు. డబ్బులు వెంటనే ఇవ్వాలని కొంతమంది ఫైనాన్షియర్లు విక్రమ్గౌడ్కు వాట్సాప్లో మేసేజ్లు పెట్టారు. ఇదిలా ఉండగా కాల్పులకు ముందు విక్రమ్గౌడ్ ఎవరెవరితో మాట్లాడారనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. అయితే 42 మందితో విక్రమ్గౌడ్ మాట్లాడారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఎవరూ కూడ అనుమానాస్పదంగా కన్పించలేదు. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్పై కూడ దృష్టి పెట్టారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను కూడ విశ్లేషిస్తున్నారు.
నివేదిక సిద్దం
విక్రమ్గౌడ్ కాల్పుల కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. విక్రమ్గౌడ్ భార్య షిఫాలి ఇచ్చిన వాంగ్మూలానికి తగ్గట్టుగా ఆధారాలు లభించకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. ఆదివారం కూడ మరోసారి పోలీసులు విక్రమ్గౌడ్, షిఫాలి వాంగ్మూలాన్ని నమోదుచేసుకొన్నారు. విక్రమ్గౌడ్ వాచ్మెన్, పనిమనిషిని కూడ విచారించారు. కాల్పలు జరిగిన సమయంలో తాము నిద్రలో ఉన్నామని, యజమాని చెప్పిన తర్వాతే మెలకువ వచ్చిందని వారు పోలీసులకు చెప్పారని సమాచారం.మూడు రోజులుగా సాగుతున్న దర్యాప్తుకు సంబంధించి పోలీసులు నివేదికను సిద్దం చేశారని సమాచారం.